సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలో రాకపోకలు సాగిస్తూ ఇక్కడి డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే కొంతమంది ఇతర రాష్ర్టాల వెండర్స్ వారి కంపెనీ కార్యకలాపాలకు సైతం తమ రాష్ర్టాలకు చెందిన వాహనాలను ఇక్కడికి నిబంధనలకు విరుద్ధంగా రప్పించి వినియోగిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన సుమారు 12 వేల వాహనాలు అక్రమంగా సిటీలో తిరుగుతున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాహన సంఘాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
నగరంలో సుమారు 80 వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. 7 రోజుల కాల పరిమితితో బార్డర్ ట్యాక్స్ పేరిట ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలోకి ప్రవేశించి ఇక్కడే తిష్ట వేస్తున్నాయి. మరోవైపు ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్ ఆధారిత సేవల్లో కూడా ఇతర రాష్ర్టాల వాహనాలే నడుస్తున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. పన్నులు, ఇన్సూరెన్స్లు చెల్లించి ప్రభుత్వానికి రాబడి వచ్చేలా తాము చేస్తుంటే ఇతర రాష్ట్రాల వాహనాలను తనిఖీలు చేయకుండా తమ ఉపాధిని దెబ్బ కొడుతున్నారని వాపోతున్నారు. బీహెచ్ఎల్ , ఆరాంఘర్, సీబీఎస్ తదితర ప్రాంతాల్లోను నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు.ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడి నడవాలంటే అవి వారి సొంత రాష్ర్టాల్లో టీఆర్ రద్దు చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కానీ ఈ పన్నును ఎగవేయడం కోసం వారు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు సల్లావుద్దీన్ మాట్లాడుతూ.. ‘నిబంధనలకు విరుద్ధంగా సుమారు 12 వేల ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయాలి. చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. కానీ అధికారులు అలా చేయడం లేదు. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను ఎన్ని సీజ్ చేశారు? పబ్లిక్ డొమైన్లో కూడా ఎలాంటి వివరాలు పెట్టడం లేదు. ఈ అంశంపై వాహన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.’ అని హెచ్చరించారు.