సర్కారీ వైద్యంపై ప్రజల్లో నెలకొన్న ప్రబలమైన నమ్మకాన్ని సడలించే కుట్రలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనమే నిజామాబాద్ జీజీహెచ్పై జరుగుతున్న దుష్ప్రచారం. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దవాఖానకు వచ్చిన రోగిని వీల్చైర్లో తీసుకెళ్లి సపర్యలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేందుకు సీసీ ఫుటేజీ దృశ్యాలే సాక్ష్యంగా నిలిస్తున్నాయి.
– నిజామాబాద్, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన వేదికగా సర్కారీ వైద్యశాలల ప్రతిష్ట దిగజార్చే కుట్రలు తెర లేచాయి. అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనమే జిల్లా జనరల్ దవాఖానపై జరుగుతున్న దుష్ప్రచారం. తాగిన మైకంలో ఉన్న రోగికి సపర్యలు చేసిన సిబ్బందిని ప్రశంసించాల్సింది పోయి, కొందరు అసత్య ప్రచారాలకు తెర లేపారు. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనను కావాలనే సృష్టించడంతో పాటు వీడియో చిత్రీకరించి వైరల్ చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు అవగతమవుతున్నది. వాస్తవానికి దవాఖానకు వచ్చిన రోగిని పేషెంట్ కేర్ సిబ్బంది వీల్చైర్లో తీసుకెళ్లడం, సపర్యలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదంతా గమనిస్తుంటే కావాలనే సర్కారు వైద్యంపై దుష్ప్రచారం చేసినట్లు స్పష్టమవుతున్నది.
కావాలనే దుష్ప్రచారం..
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వైద్య సేవల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నానుడి కాస్తా.. పోదాం పద బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్లుగా మారింది. ప్రజల్లోనూ ప్రభుత్వ వైద్యశాలలపై రెట్టింపు స్థాయిలో నమ్మకం పెరిగింది. కేసీఆర్ చొరవతో బలోపేతమైన వైద్య వ్యవస్థతో పేద కుటుంబాలకు అండ దొరికింది. ప్రైవేటు దవాఖాలల దోపిడీకి అడ్డుకట్ట పడడంతో పాటుగా పేదలకు ఆరోగ్య భరోసా కలిగింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు, కొన్ని దుష్ట శక్తులు మాత్రం వైద్య వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్నాయి. నిజామాబాద్ జనరల్ దవాఖానలో 15 రోజుల క్రితం జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తిని వైద్యం కోసం వారి బంధువులు తీసుకొస్తే జీజీహెచ్ సిబ్బంది సపన్యలు చేసి వైద్యం కూడా అందించారు. అంతలోనే సదరు రోగి కాళ్లను పట్టుకుని లాక్కెళ్లడం, ఈ ఘటనను వీడియో తీసి 15 తర్వాత వైరల్ చేశారు. దీనిపై స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జీజీహెచ్లో మెరుగైన సేవలు ..
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అత్యాధునిక, అద్భుత సేవలు అందుతున్నాయి. కొవిడ్ సమయంలో కరోనా సోకిన గర్భిణులకు వైద్యం అందించి సురక్షిత ప్రసవాలు చేయడంతో జీజీహెచ్కు మంచి పేరు వచ్చింది. మోకాలి చికిత్సలోనూ ఒకే రోజు పదుల సంఖ్యలో ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించింది. హృద్రోగ సమస్యలపై ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అధునాతన యంత్రాలతో పరీక్షల నిర్వహణతో పాటు చికిత్సలు అందించే స్థాయికి జీజీహెచ్ చేరింది. కరోనా సమయంలో 1200 మందికి అదనపు సౌకర్యాలతో పడకలను ఏర్పాటు చేసి ప్రాణాలు నిలిపిన ఘనత కూడా జీజీహెచ్ది. ఇంతటి పేరున్న జీజీహెచ్పై విష ప్రచారం చేసి ఇక్కడ పని చేసే వైద్యుల ఆత్మైస్థెర్యాన్ని, దీక్షను దెబ్బతీసేందుకు పలు రాజకీయ పార్టీలు కూడా విష ప్రచారంలో పాలుపంచుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం వెలుగు చూసిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్, బీజేపీ నాయకులే ఎక్కువగా వైరల్ చేయడంలో భాగస్వాములు అయ్యారు. పేదోడికి భరోసా కల్పిస్తున్న ప్రభుత్వ వైద్యంపై దెబ్బకొట్టి పైశాచికత్వాన్ని పొందేందుకు ఆయా పార్టీలు ఆడుతున్న నాటకాలతో చివరకు పేద కుటుంబాలకు అన్యాయం జరుగనున్నది.
విస్తరించిన వైద్య సేవలు..
2013-14లో జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో రోజువారీ ఓపీ 400 మించలేదు. కొవిడ్కు ముందు వరకు 900 వరకు ఓపీ సేవలుండగా.. 2021 నాటికి రోజుకు వేయి మంది వివిధ విభాగాల్లో ఔట్ పేషెంట్లుగా వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం రోజువారీగా ఓపీ సేవలు పొందుతున్న వారి సంఖ్య 1500 వరకు చేరింది. మెడికల్ కాలేజీ ప్రారంభం నుంచి నేటి వరకు ఏకంగా మూడు రెట్లు ఓపీ పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ముఖ్య కారణం. నిజామాబాద్ జీజీహెచ్లో మొత్తం 25 విభాగాలున్నాయి. ఇందులో 200 మంది వైద్యులు పని చేస్తున్నారు. రేడియాలజీ విభాగంలో సిటీ స్కాన్తో పాటు స్కానింగ్ యంత్రం ఉంది. రోజూ వంద మంది వరకు స్కానింగ్ కోసం వస్తుంటారు. రూ.50లక్షల సీబీపీ యంత్రం సహాయంతో రక్తనిధి కేంద్రాల్లో రక్త పరీక్షలను సైతం నిర్వహిస్తున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలు వస్తే ప్రైవేటుకు పరుగులు తీయాల్సిన పనిలేదు. ఛాతిలో నొప్పి వస్తే సర్కారు దవాఖానలో ఈసీజీ తీసి క్షణాల్లో జబ్బు విషయం తేలుస్తున్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉన్నదని గ్రహిస్తే వెంటనే మెడికల్ ఇంటెన్సివ్కేర్ యూనిట్కు తరలించి అక్కడ రూ.40వేల విలువైన ఇంజెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా జీజీహెచ్లో ఉండడం విశేషం.