ఖలీల్వాడి, ఏప్రిల్ 27 : గ్రామ గ్రామాన కారు, సారు, కేసీఆర్ అంటున్నారని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కోసం 365 రోజులు నిరంతరం కష్టపడతామని, కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకూ పోరాడుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణక్షరాలతో లిఖించబడ్డ రోజన్నారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీవన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పార్టీలు వచ్చాయని, తుంగలో పుట్టి గంగలో కలిసిపోయాయన్నారు. విజయశాంతి నుంచి కోదండరాం, దేవేందర్గౌడ్ వరకు అనేక మంది తెలంగాణపేరు మీద పార్టీలు పెట్టారని, కానీ నిలబడ్డ పార్టీ ఏదీ లేదన్నారు. తెలంగాణను సాధించిన ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. 65లక్షల మంది రైతులను ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు.
రైతులకు రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించారన్నా రు. 24 గంటలు 365 రోజులు కరెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడని, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్షా 116 లు అందించి వారి కుటుంబాన్ని ఆదుకున్నారని వివరించారు. తెలంగాణ అనే పదం కేసీఆర్కే అంకితమని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడ అని, తెలంగాణ ఎక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కన్న తండ్రిని విమర్శిస్తారా, కేసీఆర్ లేకుంటే కవిత ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యేదేనా అని ప్రశ్నించారు. పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని, కానీ కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సుజిత్సింగ్ ఠాకూ ర్, సత్యప్రకాశ్, అభిలాష్రెడ్డి పాల్గొన్నారు.