Dubai blasts : దుబాయ్ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం వేకువఝామున 20 నిమిషాల్లో 7 పేలుళ్లు సంభవించాయి. దుబాయ్లోని జెబెల్ అలి ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఈ పేలుళ్లు జరిగినట్లు ఎమిరాటి అధికారవర్గాలు తెలిపాయి. ఈ పేలుళ్లు, దాడులకు పాల్పడింది ఎవరు అనే విషయాన్ని మాత్రం దుబాయ్ అధికారులు వెల్లడించలేదు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు, పొగ వ్యాపించాయి. పోర్టు సమీపంలో చమురు నిల్వ, రవాణా చేసే ఒక వేర్హౌజ్ వద్ద భారీగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. యెమెన్ జరిపిన మిస్సైల్ దాడుల వల్ల ఈ పేలుళ్లు జరిగాయని ఇరాకీ మీడియా వెల్లడించింది.
దీనిపై కూడా ఎమిరాటి అధికారులు స్పందించలేదు. ఈ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాల్ని స్తానికులు వీడియో తీస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ పేలుళ్ల కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే ప్రపంచంలోనే భారీ పోర్టు కూడా ఉంది. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు తెలపలేదు. మరోవైపు యెమెన్ రాజధాని సనాలో కూడా పేలుళ్లు జరిగాయి. యెమెన్ భూభాగంలోకి వైమానిక దాడులు లేదా మిస్సైల్స్తో జరిపిన దాడుల వల్లే ఈ పేలుళ్లు జరిగాయని యెమెన్ అధికారులు అంటున్నారు. ఈ పేలుళ్ల వల్ల జరిగిన నష్టంపై అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఇరాన్ ఆధీనంలో ఉన్న పర్షియన్ గల్ఫ్ ద్వారా నౌకలు ఎంటర్ అయ్యి, ఒమన్ ఆధీనంలో ఉన్న మార్గం నుంచి వెళ్లిపోతాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే నౌకల రవాణాకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ ఒప్పందం కుదరాలంటే ముందుగా ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి. అయితే, గతంలో ఈ ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకించింది. దీనివల్ల నౌక రవాణా మార్గం మొత్తం ఇరాన్కు వెళ్లిపోతుందని అమెరికా భావించింది. అయితే, ఈసారి అమెరికా సానుకూలంగా మారే అవకాశం ఉంది.