నిజామాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే వేతనం చెల్లింపులు జరిగేవి. జీతాల పెంపుకై రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్ మానవత్వాన్ని చూపారు.
తెలంగాణలోని ఆశ వర్కర్లకు అమలవుతోన్న నెలవారీ జీతాన్ని భారీగా పెంచారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే వేతనాన్ని రూ.3వేలకు ఆ తర్వాత రూ.7,500లకు పెంచారు. రోడెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే, దరఖాస్తులిచ్చి దండం పెట్టే బాధలు లేకుండానే వేతనాలను పెంపును అమలు చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా పీఆర్సీని అమలు చేయడం ద్వారా వారి వేతనం ఇప్పుడు రూ.9,750 లకు చేరిందంటే ఇందుకు కేసీఆర్ ప్రభుత్వ చర్యలే కారణం. ఆశ వర్కర్లకు సమయానికి వేతనాలు చెల్లించే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దారు.
ఠంచనుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకుల్లో జమ అయ్యేలా సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆశలకు కొండంత అండగా కేసీఆర్ నిలవగా… ప్రస్తుతం పెద్ద దిక్కు లేకుండా పోయింది. జీతాలు సరైన సమయానికి పడకపోవడంతో పాటుగా వారికి మేలు చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోవడం లేదు.