ఖలీల్వాడి/విద్యానగర్, జనవరి 20 : ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
ఓటర్లకు కార్డులు అందాయా లేదా అని ఎన్నికల అధికారి ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలతో నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. కొత్తగా చేపట్టిన ఓటరు నమోదు, మార్పులు, చేర్పు ల జాబితాను సైతం క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఓటరుకార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
జాతీయ ఓటరు దినోత్సవం గురించి విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ‘మై భారత్ హూ’ గేయాలాపన అనంతరం ప్రతిజ్ఞ ఉంటుందని, అనంతరం ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్లకు సన్మానం, అవార్డుల ప్రదానం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లను, నూతన ఓటర్లను సన్మానించాలని కలెక్టర్లకు సూచించారు.
కామారెడ్డి జిల్లాలో 83 శాతం ఆదార్ అనుసంధానం ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. మొదటి విడుతలో 21,369 కొత్త ఎపిక్ కార్డులు వచ్చాయని, వీటిని పోస్టు ఆఫీస్ ద్వారా పంపిణీ చేశారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్, కామారెడ్డి జిల్లా ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, డీసీవో సింహాచలం, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్, సాత్విక్ అధికారులు పాల్గొన్నారు.