వేల్పూర్, సెప్టెంబర్ 20: భీమ్గల్ మండలం దేవక్కపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాజగంగారాం ఆయన అనుచరులతోపాటు బీజేపీ పార్టీకి చెందిన లకావత్ సంతోష్ తదితరులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో బుధవారం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనతోపాటు కేసీఆర్కు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపారు.
వీరి చేరిక దేవక్కపేట గ్రామాభివృద్ధిలో మరింత వేగాన్ని పెంచుతుందన్నారు. ఎన్నికలు రాగానే కొంతమంది ఊర్లమీద పడి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పాలనపై ఆలోచన చేస్తున్నారన్నారు. మధ్యలో వచ్చిన వారి ఆధిపత్యంతో విసిగిపోయి కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై సీనియర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్డ్డి కాంగ్రెస్ వాది కాదని, చంద్రబాబు వాది అని ఎద్దేవా చేశారు. దేవక్కపేటలో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, గ్రామంలో 500 మందికి 1200 ఎకరాల పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో వందల కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నదని తెలిపారు. బాల్కొండను బంగారుకొండలా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని మంత్రి పునరుద్ఘాటించారు.