బీఆర్ఎస్ జోరుకు తట్టుకోలేని విపక్షాలకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో చేద్దామనుకొని ప్రజల ముందు బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపై, స్పీకర్ పోచారంపై విష ప్రచారం చేయబోయి నవ్వుల పాలయ్యింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే బాన్సువాడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాంటిది సభాపతి ఇండ్లు కట్టివ్వడం లేదంటూ బీజేపీ నేతలు బుధవారం బాన్సువాడలో ఆందోళన చేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు బీజేపీకి వ్యతిరేకంగా బాన్సువాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాషాయ పార్టీతో పాటు కాంగ్రెస్ నీచ రాజకీయాలపై మండిపడ్డారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే డబుల్ బెడ్రూం కాలనీ చౌరస్తాలో నిలువునా పాతేస్తామని హెచ్చరించారు.
– నిజామాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిత్యం సత్యదూర ప్రకటనలతో వార్తల్లో, సోషల్ మీడియాలో నిలిచే బీజేపీ మరోమారు అవాస్తవాలతో నవ్వుల పాలయ్యింది. బాన్సువాడ పట్టణంలో బుధవారం బీజేపీ నిర్వహించిన ఆందోళనలు నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా మారింది. కల్లబొల్లి మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా వాస్తవ దూర ఆరోపణలతో బీజేపీ కుట్రపూరితంగా ఆందోళనలకు దిగడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై అబద్ధాలను వెదజల్లుతున్న కాషాయ పార్టీ నేతలంతా నోటికొచ్చినట్లు మాట్లాడడంతో స్థానిక ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. బాన్సువాడలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాలంటూ పసలేని డిమాండ్లతో ధర్నాకు దిగడం వారి సిగ్గులేని రాజకీయాలకు పరాకాష్టకు చేరుకున్నది. వాస్తవానికి బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో వేలాది డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణమయ్యాయి. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చొరవతో వేగిరంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ డబుల్ ఇండ్లు లబ్ధిదారులకు చేరాయి. పిల్లాపాపలతో పేద కుటుంబాలు ప్రయోజనం పొందుతుంటే అందుకు విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో బీజేపీ నేతల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నది. వాస్తవానికి బీజేపీ నేతలు ధర్నా చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలోనే వేలాది ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ప్రాంతానికి వచ్చే బీజేపీ నేతలకు నలుదిశలా డబుల్ బెడ్ రూం ఇండ్లు కండ్ల ముందే కనిపిస్తాయి. డబుల్ ఇండ్ల సముదాయం రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తుంటే ప్రభుత్వాన్ని పని కట్టుకుని తిట్టాలనే ఉద్దేశంతో నోటికొచ్చినట్లుగా అవాస్తవాలు మాట్లాడడంపై సామాన్య జనం జీర్ణించుకోవడం లేదు. బీజేపీ నేతలు తమ రాజకీయం కోసం ఎంతలా అబద్ధాలు ఆడుతున్నారన్నదీ డబుల్ ఇండ్లపై చేసిన ప్రకటనలే నిదర్శనం అంటూ లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు పేదలకు గూడు కట్టించి ఇవ్వాలనే సంకల్పం కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేస్తుంటే… పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన డబుల్ ఇండ్లపై అబద్ధాలు వల్లించడం బీజేపీ లాంటి పార్టీలకు తగదంటూ బాన్సువాడలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పొందిన వారంతా ఆగ్రహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి బాన్సువాడ నియోజకవర్గానికి 11వేల ఇండ్లను మంజూరు చేయించుకున్నారు. ప్రతీ మండలంలో వందలాది ఇండ్లు మంజూరు కావడమే ఆలస్యం వాటి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చొరవ తీసుకుని కట్టించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమ ప్రాధాన్యత గల ఈ నియోజకవర్గంలో భారీగా డబుల్ ఇండ్లు మంజూరు కాగా ఇందులో అత్యధిక భాగం నిర్మాణాలు సైతం పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి వరకు 11వేల ఇండ్లు బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరు కాగా ఇందులో అత్యధిక ఇండ్లను పంపిణీ కూడా పూర్తి చేశారు. రాకెట్ వేగంతో సాగుతున్న ఈ ఇండ్ల నిర్మాణాలతో బాన్సువాడ నియోజకవర్గం డబుల్ బెడ్ రూం ఇండ్లకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. బాన్సువాడ పట్టణంలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరల నేపథ్యంలో అందుబాటులో ఉన్న భూమిని అనుసరించి డబుల్ ఇండ్లను జీ ప్లస్ -2 పద్ధతిలో నిర్మించారు. తాడ్కోల్ శివారులో ఈ తరహాలోనే నిర్మించిన డబుల్ ఇండ్ల సముదాయం నిజానికి ఓ ప్రత్యే క పట్టణంగా దర్శనం ఇస్తున్నది. భారీ ఎత్తున డబుల్ ఇండ్ల సముదాయాలు కండ్ల ముందే కనిపిస్తుంటే బీజేపీ మాత్రం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. డబుల్ ఇండ్ల నిర్మాణాలపై అసత్య ప్రచారం చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇష్టారీతిన ప్రవర్తిస్తోంది.
రాష్ట్రంలో వేగంగా డబుల్ ఇండ్లు నిర్మాణంలో ఉన్న నియోజకవర్గంలో బాన్సువాడకు ప్రత్యేక స్థానం దక్కింది. ఇప్పటి వరకు మంజూరైన డబుల్ ఇండ్ల పథకంలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న ప్రాంతంగా బాన్సువాడకు గుర్తింపు వచ్చింది. మంజూరైన ఇండ్లను వెంటనే పట్టాలెక్కించి వాటి నిర్మాణ పనులను దగ్గరుండి స్పీకర్ స్వయంగా పర్యవేక్షిస్తూ పూర్తి చేయిస్తున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లు లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్లాయి. పారదర్శకంగా ఎంపిక చేసిన అర్హులైన వారికి మాత్రమే డబుల్ ఇండ్లను అందించారు. ఇందుకోసం థర్డ్ పార్టీ విచారణతో అర్హులను గుర్తించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, స్థానికత ఆధారంగానే దరఖాస్తులను పరిశీలించారు. రాజకీయ పార్టీ నాయకులకు ఎలాంటి పాత్ర లేకుండా డబుల్ ఇండ్ల జాబితాను రూపొందించారు. ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించారు. తద్వారా పారదర్శకత ఏర్పడడంతో పాటు రూపాయి ఖర్చు లేకుండా ఉండడానికి ఇండ్లు దొరకడంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రోకర్లు, చీటర్లకు స్థానం లేకుండా నిరుపేద కుటుంబాలకు అండగా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నిలిచారు.