నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ 70శాతం లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామమని వారం చివరికి వందశాతం పూర్తి చేయాలని సూచించారు. బతుకమ్మ చీరలు పంపిణీ గ్రామపంచాయతీ వారిగా మంగళవారం నుంచి ఈనెల 9వతేదీ వరకు పూర్తి చేయాలని తెలిపారు.
పాన్ ఇండియా ప్రోగ్రాంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రాజెక్టులు చెరువులలో ఉచిత చేప పిల్లల పంపిణీ అధిక వర్షాలతో ఆలస్యమైనందున ఈ నెల ఆఖరి వరకు పూర్తి చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని , మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో పరిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రమిశ్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.