బోధన్, ఫిబ్రవరి 24: నిజాంషుగర్స్కు పూర్వ వైభవం తీసుకొచ్చి, చెరుకు రైతుల అభ్యున్నతికి కృషిచేస్తామని పునరుద్ధరణ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ కమిటీ శనివారం సందర్శించింది. ఫ్యాక్టరీలోని యంత్రాలు, పవర్ ప్లాంట్ను సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, షుగర్ కేన్ డైరెక్టర్ డాక్టర్ మల్సూర్తోపాటు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం వారు చెరుకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కొందరు రైతులు చెరుకు సాగుపై తమ అభిప్రాయాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు మాట్లాడుతూ.. నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ఆచరణాత్మక కార్యచరణ కోసం రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున చెరుకు పంట పండించడంతోపాటు అధిక దిగుబడులు సాధించినప్పుడు నిజాంషుగర్స్ లాభాల బాట పడుతుందని తెలిపారు. ఫ్యాక్టరీ ఆస్తులు, భూములపై బ్యాంకు రుణాలు ఉన్నాయని, వీటిని విడిపించడానికి ఏం చేయాలనే విషయమై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బోధన్ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిజాంషుగర్స్ను 2015లో లేఆఫ్ ప్రకటించగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదన్నారు.
రాయితీలు ఇవ్వండి: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
చక్కెర ఫ్యాక్టరీల మనుగడకు, చెరుకు ఉత్పత్తి పెరగడానికి రైతులు, చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ప్రభుత్వం తరఫున రాయితీలు ఇవ్వాలని నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
చెరుకు దిగుబడి పెంచాలి
చక్కెర ఫ్యాక్టరీలు లాభాలు గడించాలన్నా, అధిక దిగుబడులు సాధించేలా ఆధునిక పద్ధతుల్లో రైతులు చెరుకు సాగు చేయాలని పునరుద్ధరణ కమిటీ సభ్యుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. అధిక దిగుబడిని ఇచ్చే చెరుకు వంగడాలపై పరిశోధనలు చేసి రైతులకు అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో చెరుకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలకు ఇబ్బందులు వస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నిజాంషుగర్స్కు మంచి రోజులు వచ్చాయని, త్వరలోనే ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగి రైతులు, కార్మికుల కల నెరవేరుతుందన్నారు. ప్రస్తుతమున్న నిజాం షుగర్స్ మిల్లును తెరవాలా.. లేదా మరోచోట కొత్త టెక్నాలజీతో కొత్తగా మిల్లును ఏర్పాటుచేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బోధన్ ప్రాంతంలో కాలుష్య రహిత ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటుచేయాలని మంత్రి శ్రీధర్బాబును ఆయన కోరారు.