ఆర్మూర్, ఫిబ్రవరి17 : ఆర్మూ ర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణం ప్రాంతం లో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు శుక్రవారం ఉదయం ఢీకొట్టింది. ఆర్మూర్ ఎస్హెచ్వో సురేశ్ బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన బస్సు 38మంది ప్రయాణికులతో రాయచూర్ నుంచి హైదరబాద్కు వస్తుండగా పెర్కిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 13 మందితో పాటు ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్హెచ్వో సురేశ్బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
బస్సులో నుంచి క్షతగాత్రులను బయటికి తీసి అంబులెన్స్ లో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదం కారణంగా రహదారిపై ట్రా ఫిక్కు అంతరాయం ఏర్పడడంతో లారీ, బస్సును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.