బిచ్కుంద, ఫిబ్రవరి 8:కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసిన శనగ పంటను యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు. ప్రతి రోజూ శనగ పంటను నూర్పిడి చేయడంతో రోజుకు ఖర్చులు పోను రూ.2వేలు మిగులుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు పండించిన శనగ పంటను నూర్పిడి చేసి ఉపాధి పొందుతున్నారు.
‘ఇక్కడి సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సాగునీరు, బోరుబావులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో రైతులు పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. రైతుబంధు పథకంతో పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పంటలు పండిస్తూ లాభాలు పొందుతున్నారు. ఇక్కడ రైతులకు అందిస్తున్న పథకాలను చూస్తుంటే మా రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం’ అని రాజస్థాన్, మధ్యప్రదేశ్ వలస కూలీలు పేర్కొంటున్నారు.
మా రాష్ట్రంలో ఎర్రరేగడి భూములు ఉండడంతో పంటలు నామమాత్రంగా పండుతాయి. వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం చేయవు. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే మా రాష్ట్రంలోని రైతులకు కూడా రైతుబంధు వస్తుంది. ఇక్కడ అందిస్తున్న పథకాలన్నీ మాకూ అందే అవకాశం ఉంటుంది. ఇక్కడి రైతులు నిజంగా అదృష్టవంతులు.
– భూపాల్, వలస కూలీ, రాజస్థాన్
మా రాష్ట్రంలో ఉపాధి దొరకడం లేదు. తెలంగాణలో చాలా పనులు ఉన్నాయి. మా రాష్ట్రంలో పంటలు పండినా ఎక్కువ దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం పంట నూర్పిడి సీజన్లో వస్తాం. రోజుకు సుమారు వెయ్యి నుంచి 2వేల వరకు సంపాదిస్తాం. తెలంగాణ మాకు అన్నం పెడుతుంది.
– పర్వేజ్, వలస కూలీ, మధ్యప్రదేశ్