కోటగిరి, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకం పేదలకు వరంలాంటిదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోటగిరి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలోని 84 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 14 వేల మంది ఆడబిడ్డలకు రూ.120 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సొంత స్థలం ఉన్నవారికి త్వరలో రూ.3లక్షల ఇంటి స్కీం రానున్నదని చెప్పారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిని మంజూరు చేస్తామన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న నీటిని రైతులు అవసరం మేరకు వాడుకోవాలని, వృథా చేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్ర ప్రజలు, నాయకులు బీఆఆర్ఎస్ పార్టీలో చేరుతామని చెప్పారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాస్, జడ్పీటీసీ శంకర్పటేల్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జడ్పీ కో-ఆప్షన్ సిరాజ్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొల్లూర్ కిశోర్బాబు, విండో చైర్మన్ కూచి సిద్దు, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, తేళ్ల అరవింద్, బీర్కూర్ గంగాధర్, బర్ల మధు, బోధన్ ఏసీపీ కిరణ్కుమార్, తహసీల్దార్లు శ్రీకాంత్రావు, రమేశ్,ఎంపీడీవో మారుతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.