వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన మాదిరిగానే పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులను పాడిరంగం వైపు ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి గేదె పాలు లీటర్కు రూ.73 నుంచి రూ.80కి పెంచి పాడి రైతులకు ఇస్తున్నది. గిట్టుబాటు ధర రావడంతో గేదెల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేందుకు చిన్న, సన్నకారు రైతులు ఆసక్తిని చూపుతున్నారు. మరోవైపు వినియోగదారులకు ప్రైవేట్ డెయిరీల కన్నా తక్కువ ధరకే విజయ డెయిరీ స్వచ్ఛమైన పాలు అందిస్తున్నది.
నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 8 : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరిచినట్లుగానే దానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధి పట్ల కూడా ప్రత్యేక చొరవ చూపుతున్నది. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు అందించే లక్ష్యంతో విజయ డెయిరీ ముందుకు సాగుతున్నది. ప్రైవేట్ డెయిరీల కన్నా తక్కువ ధరకు నాణ్యమైన పాలు వినియోగదారులకు విక్రయిస్తున్నది. విజయ డెయిరీకి చెందిన పాల కేంద్రంలో పాలు పోసే రైతులకు లీటర్కు రూ.4 ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు పెళ్లికానుక, విద్యాకానుక వంటి తదితర సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నది. అంతేగాకుండా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గేదె పాలు లీటర్కు రూ.73 నుంచి రూ.80 పెంచి ఇస్తున్నారు. గిట్టుబాటు ధర రావడంతో గేదెల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చేందుకు చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె.నందకుమారి, మేనేజర్ రమేశ్ పర్యవేక్షణలో పాల ఉత్పత్తిదారుల నుంచి పాలను సేకరించి తద్వారా తయారుచేసిన ప్యాకెట్లను క్రయవిక్రయాలు జరుపుతున్నారు.
ప్రస్తుతం పాల ఉత్పత్తి సీజన్ ఉన్నందున రోజుకు జిల్లాలో 9వేల లీటర్ల పాలను విజయ డెయిరీ కేంద్రాల ద్వారా సేకరిస్తున్నది. సేకరించిన పాలను సారంగాపూర్ వద్ద ఉన్న విజయ డెయిరీలో తయారు చేసిన పాల ప్యాకెట్లను డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. పాల ప్యాకెట్ల విక్రయాల ద్వారా రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం చేకూరుతున్నది. అంటే ఒక నెలలో పాల అమ్మకాల నుంచి రూ.45 లక్షల ఆదాయం లభిస్తున్నది. అత్యధికంగా రూ.1.20 లక్షల విలువ గల పాలను ప్యాకెట్ల ద్వారా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇక మిగిలిన రూ.30వేలు విలువ గల పాలను ప్యాకెట్ల రూపంలో సివిల్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు సివిల్ మార్కెట్లో విక్రయాలు జరిపేందుకు 5 వేల లీటర్ల పాలు అవసరమున్నది. మిగిలిన 4 వేల లీటర్ల పాలు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో విజయ డెయిరీకి పంపిస్తున్నారు.
పాడీ రైతులకు గిట్టుబాటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఒక లీటర్ గేదె పాలలో 10 శాతం వెన్న ఉంటే ధర రూ.73 నుంచి 80కి పెంచి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి చెల్లిస్తున్నది. ఆవు పాలు అయితే లీటర్కు రూ.40 చెల్లిస్తున్నారు. విజయ డెయిరీ పాల కేంద్రంలో పాలు పోస్తున్న రైతులకు15 రోజులకొకసారి బిల్లులు చెల్లిస్తున్నారు. పాడి రైతుల బ్యాంకు ఖాతాల్లోనే బిల్లులకు సంబంధించిన డబ్బులు జమవుతున్నాయి.15 రోజులకొకసారి పాలు పోసిన రైతులకు రూ.65 లక్షలు చెల్లిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీకి 6 వేల మంది పాడి రైతులు పాలు పోసేవారున్నారు. అయితే అన్సీజన్లో 2 వేల మంది పాడి రైతుల నుంచి మాత్రమే పాలను సేకరిస్తున్నారు. పాల ఉత్పత్తి సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 3,800 మం ది పాడి రైతులు పాలు పోస్తున్నారు. జిల్లాలో 120 పాల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా సేకరించిన పాలు చెడిపోకుండా ఉండేందుకు ఆరు పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోటగిరి, వర్ని, బోధన్, ఆలూర్, నవీపేట్, ధర్పల్లి మండల కేం ద్రాల్లో పాల శీతలీకరణ కేంద్రాలున్నాయి. గ్రామాల్లో ని పాల కేంద్రాల నుంచి సేకరించిన పాలను తమకు అందుబాటులో ఉన్న పాల శీతలీకరణ కేంద్రాలకు త రలిస్తారు. అక్కడి నుంచి సారంగాపూర్ శివారులోని విజయ డెయిరీకి పాలను తరలించి ప్యాకెట్లను తయారుచేస్తారు.
కు పోషకాహారంతో కూడిన దాణాను విజయ డెయిరీ అధికారులు పెంపకందారులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్నారు. ఈ దాణా తినిపించడం ద్వారా పాల దిగుబడి పెరగడంతో పాటు వెన్నశాతం కూడా పెరుగుతుంది. తద్వారా పాడి రైతులకు ఆదా యం కూడా ఎక్కువగా సమకూరే అవకాశముంటుం ది. పశువుల దాణా 50 కిలోల బ్యాగ్ ధర రూ.1150 ఉండగా పాడి రైతులకు రూ.750కి ఇస్తున్నారు.
విజయ డెయిరీలో పాల ప్యాకెట్ల తయారీతో పాటు పెరుగును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 200 లీటర్ల పెరుగు ఉత్పత్తి చేసి విక్రయాలు చేస్తున్నారు.
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. పెళ్లీడుకొచ్చిన కూతురు, కొడుకు పెళ్లి జరిపించినప్పుడు పెళ్లికానుక పేరిట రూ.5వేలు సాయం అందిస్తున్నది. ఇప్పటివరకు 83 మందికి పెండ్లి కానుక అందించారు. అదేవిధంగా తన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చు నిమిత్తం రూ.5వేలు చెల్లిస్తున్నారు. వైకుంఠధామం ఖర్చు కోసం 36 మందికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయమందించారు. 10వ తరగతిలో 9 జీపీఏ కన్నా ఎక్కువ వచ్చిన పాడి రైతు పిల్లలకు విద్యాకానుక పేరిట వెయ్యి రూపాయలు ప్రోత్సాహకంగా ఒకరికి అందించారు. ఇలాంటి ప్రోత్సాహాకాలు అందిస్తున్నందున పాడి రైతులు పాడి పశువుల పెంపకం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సిబ్బందితో కలిసి సమిష్టి కృషి చేస్తున్నాం. పాడి రైతులకు ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం, పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నందున పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు పాల శీతలీకరణ కేంద్రాల పరిధిలో ఉన్న ఆరుగురు సూపర్వైజర్లు సిబ్బందితో కలిసి పాల సేకరణ పెంపొందించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలు పోసిన రైతులకు ప్రతి 15 రోజులకొకసారి బిల్లులు చెల్లిస్తున్నారు.