ఎల్లారెడ్డి, జూన్ 23 : కొండలు.. గుట్టల.. మధ్యన అక్కడక్కడ పారేసినట్లుగా ఉండే గిరిజన గూడేలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కళ వచ్చింది. గత పాలకుల హాయాంలో వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే చూడడంతో ఎలాంటి సౌకర్యాలు లేక కేవలం వంట చెరుకు అమ్ముకోవడం, వానకాలంలో పండే పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వారికి సరైన గౌరవం దక్కుతున్నది. ప్రభుత్వం తీసుకున్న సమున్నత నిర్ణయం కారణంగా కేవలం కామారెడ్డి జిల్లాలోనే 57 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో ప్రతి గ్రామ పంచాయతీకి తమను తామే పాలించుకునే అధికారం వచ్చింది. దీనికి తోడు గిరిజన గ్రామాలకు ప్రత్యేకంగా తారు రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలోని 18 నియోజకవర్గాలకు 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడంతో కామారెడ్డి జిల్లాకు రూ.70 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు తారు రోడ్లు నిర్మించేందుకు ఎల్లారెడ్డి నియోజక వర్గానికి రూ.35 కోట్లు, కామారెడ్డి నియోజక వర్గానికి రూ.15 కోట్లు, బాన్సువాడ నియోజకవర్గానికి రూ.10 కోట్ల 35 లక్షలు, జుక్కల్ నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు కావడంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు వివిధ గ్రామాల్లో పనులు చేపట్టడానికి అంచనాలు తయారు చేసి టెండర్ల కోసం అధికారులకు పంపించారు. ఇప్పటికే పలు రోడ్డు పనులకు టెండర్లు పూర్తి కాగా మరికొన్నింటికి టెండర్లు జరుగుతున్నాయి. రూ.70 కోట్లతో పనులు పూర్తయితే జిల్లాలోని మెజారిటీ గిరిజన గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం కలుగుతుందని అధికారులు అంటున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావస్తున్నందున కేవలం ఒకటి లేదా రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత పాలకుల హయాంలో రోడ్డుపై నాట్లు..ఇప్పుడేమో తళ తళ మెరిసే తారు రోడ్లు…
తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలోని మెజారిటీ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక పోయేది. వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్యంతో ఉండే వారిని వైద్యం కోసం తరలించడం గగనంగా ఉండేది. బడికి వెళ్లే విద్యార్థులు అవస్థలు పడేవారు. గాంధారి మండలంలోని యాచారం, నాగిరెడ్డిపేట మండలంలోని పల్లె బోగుడ తండా, లింగంపేటలోని శెట్పల్లి తండాలకు కాలినడకన వెళ్లే దుస్థితి ఉండేది. వర్షాకాలంలో చాలా గిరిజన గ్రామాల ప్రజలు తమ రహదారి పరిస్థితిని చూపేందుకు రోడ్డుపైనే నాట్లు వేసి ఇది పంట పొలమా.. రోడ్డు సౌకర్యామా.. అంటూ నాయకులను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని గ్రామాలకు అందినట్టుగానే గిరిజన గ్రామాలకు సైతం పూర్తి స్థాయి సౌకర్యాలు కలుగుతున్నాయని జిల్లాలోని గిరిజనులు అంటున్నారు.
57 కొత్తగా గిరిజన గ్రామ పంచాయతీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గిరిజన గ్రామాలకు కొత్తదనం వచ్చింది. 2017లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కామారెడ్డి జిల్లాలో 57 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయి. గ్రామాలకు దూరంగా ఉండి పరిపాలన సౌకర్యం లేక అభివృద్ధికి నోచుకోలేవు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాలను ప్రత్యేకంగా సర్వే చేయించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఆ గ్రామాలకు దర్పం వచ్చింది. కొత్తగా ఎన్నికైన గిరిజన సర్పంచులు తామే స్వయంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్తో పాటు హరితహారంలో నాటిన మొక్కలను రక్షించేందుకు ట్యాంకర్లను ఇవ్వడంతో గ్రామాల్లో ప్రజలు వాటిని వాడు కుంటున్నారు.
మట్టిలోనే నడిచే వాళ్లం
కాంగ్రెస్ ఉన్నప్పుడు పాదం మునిగే మట్టి రోడ్డులోనే నడిచి మా ఊరికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మా గ్రామంలో సీసీ రోడ్డు వేసింది. పట్టణంలో రోడ్డు వేసుడే కాదు.. గరీబోల్లు ఉండే గ్రామాల్లో తారు రోడ్డు వేస్తే అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తది. గీ ప్రభుత్వం మరో పది సంవత్సరాలు పని చేస్తే బంగారు తెలంగాణ కావడం ఖాయం.
– భిక్షపతి నాయక్, నల్లమడుగు తండా, లింగంపేట
ప్రత్యేక నిధులిచ్చాం..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గిరిజనులు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి మండలంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నందున, సీఎం కేసీఆర్ను కలిసి ప్రత్యేకంగా రూ.35 కోట్లను మంజూరు చేయించాను. వీటికి తోడుగా మరో రూ.ఏడు కోట్లు మంజూరు చేయించడంతో చాలా గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గిరిజన గ్రామాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. గ్రామాలకు నేరుగా నిధులు వస్తున్నాయి. గిరిజన గ్రామాల కోసం మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాను.
– జాజాల సురేందర్, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి