డీలర్లకు కొత్త ఐ-పాస్ యంత్రాలు..
అందుబాటులోకి 4జీ సేవలు
బ్లూటూత్తో కూడిన వెయింగ్ మిషిన్లు పంపిణీ
ఇక సరుకుల పంపిణీలో అధునాతన సాంకేతికత
వ్యవస్థను గాడిలో పెట్టిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
మూసుకు పోయిన వక్రదారులు
రేషన్ దుకాణాల్లో ఉన్న అస్తవ్యస్థ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడుతూ వస్తున్నది. సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రస్తుతం 4జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. గతంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు ఐరిస్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులోనూ పలు లోపాలు తలెత్తుతుండడంతో మరింత సాంకేతికతను జోడించి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. జూలై ఒకటో తారీఖు నుంచి సరుకుల పంపిణీకి 4జీ సేవలతో కూడిన ఈ-పాస్ యంత్రాలను వినియోగించబోతున్నారు. వీటితో పాటే బ్లూటూత్ డివైస్తో కూడిన వెయింగ్ మిషిన్ను కూడా రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సరుకుల పంపిణీలో కోత విధించడం ఇకపై కుదరదు. కొత్త ఈ-పాస్ యంత్రాల్లో సెకన్లలోనే ఐరిస్, వేలి ముద్రలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ-పాస్ యంత్రాలను నేటి నుంచి నుంచి డీలర్లకు పంపిణీ చేయనున్నారు. వీటి వినియోగంపై 29వ తేదీన శిక్షణ ఇవ్వనున్నారు.
నిజామాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రేషన్ దుకాణాల్లో గతమంతా అక్రమాల పర్వం. పేద కుటుంబాలకు చేరే సరుకుల్లో అడుగడుగునా కోతలు. ఒక నెల సరుకులు తీసుకోకపోతే మరో నెలలో వచ్చేదే కాదు. ఒక నెల తప్పిస్తే మన పేరిట వచ్చే సరుకులు అమ్ముకునే తంతు ఇష్టారాజ్యంగా జరిగేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల్లో సమూల మార్పులు చేశారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించి సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టారు. ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసరాల మినహా ప్రైవేటు ఉత్పత్తులు అంటగట్టే విధానానికి సైతం స్వస్తి చెప్పారు. డీలర్ల ఆగడాలకు ముకుతాడు వేసిన సర్కారు… మొత్తం పౌరసరఫరాల వ్యవస్థను గాడిలోకి తీసుకువచ్చింది. తాజా గా మరో క్రియాశీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఐరిస్ ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటి స్థానంలో మరింత మెరుగైన సాంకేతికతను అభివృద్ధి చేసి అమలు చేయబోతున్నది. జూలై ఒకటో తారీఖు నుంచి సరుకుల పంపిణీలో 4జీ సేవలతో కూడిన ఈ-పాస్ యంత్రాలను వినియోగించబోతున్నారు. వీటితో పాటే బ్లూటూత్ డివైస్తో కూడిన వెయింగ్ మిషిన్ను కూడా రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సరుకుల పంపిణీలో కోత విధించడం ఇకపై కుదరదు.
ప్రజా పంపిణీలో 4జీ శకం…
ఈ-పాస్ విధానం ద్వారా రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు, ఐరిస్ ఆధారంగా బియ్యం పంపిణీ జరుగుతున్నది. ఫలితంగా అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో పాటు లబ్ధిదారుడికి మేలు చేకూరుతున్నది. ఈ-పాస్లో వేలి ముద్రలు పడని వారికి రేషన్ బియ్యం పంపిణీ కాసింత అవరోధంగా మారుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్నతకు పెద్ద పీట వేస్తూ చర్యలు తీసుకుంటున్నది. ఐరిస్ విధానం ద్వారా రాయితీ బియ్యం పంపిణీ సైతం మొదలైంది. ఇందులోనూ పలు లోపాలు బహిర్గతం కావడంతో వీటి స్థానంలో నూతన టెక్నాలజీని తీసుకు వచ్చా రు. 4జీ టెక్నాలజీతో కూడిన ఈ-పాస్ యంత్రాలను తీర్చిదిద్దగా వీటిని డీలర్లకు అందించబోతున్నారు. వీటి ద్వారా కేవలం మూడు సెకన్లలోనే ఐరిస్ను కాప్చర్ చేసే సాంకేతికతను యంత్రంలో అమర్చారు. అదే విధంగా వేలి ముద్రల సేకరణలో ఎదురైన ఇబ్బందులకు చెక్ పెట్టారు. కొత్త యం త్రంలో వృద్ధుల వేలి ముద్రలను సులువుగా సేకరించే ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు ఈ-పాస్ యంత్రాలకు సిగ్నల్ సమస్య ఎదురయ్యేది. గ్రామాల్లో సిగ్నల్ లేకపోవడంతో కొంత మంది డీలర్లు పాత పద్ధతుల్లోనూ సరుకులు పంపిణీ చేసిన దాఖలాలు ఉండేవి. ఇకపై ఇలాంటి వాటికి అవకాశం ఉండబోదు.
రేషన్ కార్డుల వివరాలివీ…
గతేడాది కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డులు భారీగా పెరిగాయి. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థ పరిధి నుంచి 16,257 నూతన కార్డులు ఇచ్చారు. ప్రస్తుతం మొత్తం 751 రేషన్ దుకాణాల్లో 4,06,772 రేషన్ కార్డులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలు, మూడు మున్సిపాలిటీ పరిధిలో 5642 దరఖాస్తులను పరిశీలించిన నూతన రేషన్ కార్డులు అందించారు. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మొత్తం 2లక్షల 48వేల 268 రేషన్ కార్డులున్నాయి. నూతనంగా జారీ చేసిన 5642 కార్డులతో మొత్తం తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 2,53,910 కార్డులకు చేరింది. త్వరలోనే ఈ-పాస్ యంత్రాలతో పాటుగా ప్రతి రేషన్ దుకాణానికి ప్రభుత్వమే వెయింగ్ మిషిన్లను పంపిణీ చేయబోతున్నది. ఇప్పటి వరకు కేవలం 60 కిలోలు మాత్రమే తూకం వేసే ఆస్కారం ఉంది. కొత్త యంత్రాల్లో 100 కిలోల వరకు తూకం వేసే అవకాశం ఉంది. పైగా లబ్ధిదారుల వాటాకు గండి కొట్టే ఆస్కారం లేకుండా వెయింగ్ మిషిన్ను తీర్చిదిద్దారు. ఈ యంత్రానికి బ్లూటూత్ డివైజ్ను కనెక్ట్ చేస్తున్నారు.
మూసుకు పోయిన వక్రదారులు…
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రేషన్ డీలర్లు కొత్త దారులు వెతుకుంటున్నారు. ఏదో రకంగా రాయితీ బియ్యాన్ని నొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ-పాస్ ద్వారా సరుకుల సరఫరాలో పారదర్శకత పెరిగింది. అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలను బూచీగా చూపించి రేషన్ డీలర్లు అక్కడక్కడ బియ్యాన్ని బొక్కేస్తున్నారు. జిల్లాలో ఆయా చోట్ల లబ్ధిదారులకు వేలి ముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ ఆథరైజేషన్ పేరిట సరుకులు పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల ఆథరైజేషన్ ఇచ్చే రెవెన్యూ సిబ్బందితో డీలర్లు కుమ్మక్కై లబ్ధిదారులకు సరుకులు ఇవ్వకుండానే స్వాహా చేస్తున్నారని ప్రభుత్వం గ్రహించింది. లబ్ధిదారుల వేలిముద్రలకు బదులుగా వారి కనుపాపలను స్కానింగ్ చేసి ఐరిస్ విధానం ద్వారా సరుకులు పంపిణీని అమలు చేసింది. పారదర్శకంగా జరుగుతున్న నిత్యావసరాల పంపిణీలో మరింత కచ్చితత్వాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా తాజాగా 4జీ సేవలను తీసుకు వస్తుండడంతో కొంత మంది అడ్డదారులు తొక్కుతున్న డీలర్ల వక్రదారులు మూసుకు పోయినట్లే అయ్యింది.
సెకన్లలోనే గుర్తింపు ప్రక్రియ…
కొత్తగా ఈ-పాస్ యంత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని జూన్ 27 నుంచి డీలర్లందరికీ పంపిణీ చేస్తున్నాము. 29వ తారీఖు నాడు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జూలై 1 నుంచి కొత్త యంత్రాల సహకారంతోనే ప్రజా పంపిణీ వ్యవస్థ పని చేస్తుంది. కొత్త ఈ-పాస్ యంత్రాల్లో సెకన్లలోనే ఐరీష్, వేలి ముద్రలను గుర్తించే అవకాశం ఉంటుంది. 4జీ లేటెస్ట్ వర్షన్ను ఇందులో అప్డేట్ చేశారు.
– వెంకటేశ్వర్లు, నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి