దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్యులర్) కల్పించడంతో పాటు పేస్కేల్ వర్తింపజేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏల అర్హతల ఆధారంగా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్య, వైద్యం, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో నియమించనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,059 మంది వీఆర్ఏలకు ప్రయోజనం కలుగనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ రెవెన్యూ సహాయకులు సంబురాల్లో మునిగి పోయారు. రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందభాష్పాలతో వెల్లడించారు.
– కామారెడ్డి, జూలై 24 (నమస్తే తెలంగాణ)/ఖలీల్వాడి
సమైక్య పాలనలో వారికి కనీస గుర్తింపు లేదు. పటేల్, పట్వారీలు, రెవెన్యూ అధికారుల చేతుల్లో కీలుబొమ్మల్లా మారారు. భూమి శిస్తు వసూలు చేసిన తర్వాత ఆ అధికారుల ఇండ్లలో పనులు చేస్తూ, వారి నుంచి ఛీత్కారాలు పొందుతూ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, వారి సొంత జీతగాళ్లుగా పనులు చేస్తుండేవారు. కనీస వేతనాలు పొందక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఆర్థిక అవస్థల పాలయ్యేవారు. అయినా గ్రామాల్లో చేయడానికి వేరే పనులు లేక వంశపారంపర్యంగా కాందార్లుగా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చారు. కాందార్లు, గ్రామ సుంకరులు, ముస్కురి, నీరటి వాళ్లుగా పేర్కొనే వీరిని గ్రామంలోని ప్రతి ఒక్కరూ చిన్నచూపు చూసే వారు. ఒక్కో రెవెన్యూ గ్రామంలో 5 నుంచి 10 మంది ఉండే వీరి శ్రమను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వారు ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు చేపట్టింది. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లుగా వారికి హోదా కల్పించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.6,500 నుంచి రూ.10,500 వరకు పెంచింది. రెవెన్యూకు సంబంధించిన నిర్ధిష్టమైన పనులు మాత్రమే చేసేలా అధికారులకు సూచనలు చేసింది. సీఎం కేసీఆర్ ఆది నుంచి వీఆర్ఏల పట్ల ఎంతో ఆప్యాయతతో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. చిరుద్యోగులైన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకొని వీఆర్ఏలను రెగ్యులర్ ఉద్యోగులుగా, పేస్కేల్ అందేలా చర్యలు చేపట్టడంతో వారిలో ఉత్సాహం నెలకొన్నది.
వీఆర్ఏల క్రమబద్ధీకరణతో నిజామాబాద్ జిల్లాలోని 1600, కామారెడ్డి జిల్లాలోని 1459 మందికి లబ్ధి చేకూరనున్నది. కామారెడ్డి జిల్లాలో జిల్లాలో 24 మండలాలు, 526 గ్రామాలు ఉండగా 473 రెవెన్యూ గ్రామాలున్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున ఇద్దరి నుంచి నలుగురు వీఆర్ఏలు పనిచేస్తున్నారు. కామారెడ్డి రెవెన్యూ డివిజన్లో 532, బాన్సువాడ డివిజన్లో 562, ఎల్లారెడ్డి డివిజన్లో 365 మంది వీఆర్ఏలు ఉన్నారు. గతంలో వీరు ప్రధానంగా పొలాలకు సంబంధించిన పన్నులు వసూలు చేసేవారు. ప్రభుత్వం రైతుల పన్నులను మాఫీ చేయడంతో వీరికి తహసీల్ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, గ్రామాల్లోని ఇతర ప్రభుత్వ పనులు అప్పగించారు. రెవెన్యూ రికార్డులను భద్రపర్చడంలోనూ వీరే కీలకంగా ఉన్నారు. దశాబ్దాలుగా వీఆర్ఏలు పనిచేస్తుండగా వంశపారంపర్యంగా పనిచేస్తున్న వారిలో ప్రస్తుతం యువకులే అధికంగా ఉన్నారు. గతంలో నిరక్ష్యరాసులు కాందార్లుగా పని చేసేవారు. వారి స్థానంలో వచ్చిన కుమారులు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారూ ఉన్నారు. దీంతో వీరి అర్హతల ఆధారంగా మెజారిటీ వీఆర్ఏలకు రెగ్యులర్ ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి.
ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం ముందుగా వీఆర్ఏలకు సంబంధించిన సమగ్ర వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై, దరఖాస్తు చేసుకున్న వీఆర్ఏలు, వారి వారసుల వివరాలు, విద్యార్హతలను సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 3059 మంది వీఆర్ఏల డాటాను సేకరించారు. అర్హతల ఆధారంగా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, జిల్లా పరిషత్, విద్యాశాఖ, మెడికల్ కళాశాల, వైద్య, ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో నియమించనున్నారు.
తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి లభించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి సీఎం కేసీఆర్ మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. మాకు పేస్కేల్ వర్తింపజేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
– గుర్రపు గణేశ్, వీఆర్ఏ, ఇందల్వాయి
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. అందరికీ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతున్నాయి. మాకు అవుతాయో లేదో అని అనుకుంటున్న సమయంలో సీఎం కేసీఆర్ సార్ మా గోస చూసిండు.. మాకు ఉద్యోగ భద్రత కల్పించిండు. కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– కోరట్పల్లి శ్రీకాంత్, ధర్పల్లి
నమ్మలేని సత్యం. మా జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నిం పిండు. మేము చేస్తున్న కష్టానికి తగిన ఫలితాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వడంపై మా వీఆర్ఏల తరఫున కృతజ్ఞతలు. ఏ ప్రభుత్వలూ మమ్మల్ని పట్టించుకోలేదు. కిందిస్థాయి నుంచి ఉద్యోగిగా నిలిపాడు.
– కళాల బాలకిషన్, వీఆర్ఏ, కమ్మర్పల్లి
నీరడితనం నుంచి వీఆర్ఏలుగా మలి చి ఉద్యోగ భద్రత కల్పించిన మహానుభావుడు సీఎం కేసీఆర్. ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించిన ఏకైక సీఎం. మా కష్టాన్ని తెలుసుకొని, మా బాధలు తీర్చిన నేత. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– గంగరాం, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు, డిచ్పల్లి
తెలంగాణ వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరినీ ఆదుకుంటున్నారు. ఇటీవలే పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించారు. ఇప్పుడు మమ్మల్ని కూడా గుర్తించి ఉద్యోగభద్రత కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్.
– దండు సూర్యరాజు, వీఆర్ఏ, బర్దీపూర్
కొన్ని సంవత్సరాలుగా మా ఉద్యోగాల భద్రత కలగానే మిగిలిపోతుందని అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే మా కల నెరవేర్చిండు. ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించడంలో కేసీఆర్ను మించినవారు లేరు. మా జీవితాల్లో వెలుగులు నింపిండు.
– కామ గంగారాం, వీఆర్ఏ, సుద్దపల్లి