ఏసీబీ అధికారులకు బాధితుడి ఫిర్యాదు
ఇందల్వాయి తహసీల్దార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ దాడులు
ఆదాయానికి మించి ఆస్తులపై ఆరా
తహసీల్దార్, ఆర్ఐపై కేసు నమోదు
వివరాలను వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్
నిజామాబాద్ క్రైం,జూన్ 30 : ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలానికి చెందిన సతీశ్కు సంబంధించి ఇసుక ట్రాక్టర్ను తహసీల్దార్ ఆదేశాలతో సిబ్బంది సీజ్ చేశారు. తన ట్రాక్టర్ను రిలీజ్ చేయాలని సతీశ్ తహసీల్దార్ రమేశ్ను కోరాడు. ట్రాక్టర్ను విడిచి పెట్టాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్తోపాటు ఆర్ఐ బషీర్ అలీఖాన్ సైతం డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. చివరకు రూ.25వేలు వాల్టా అకౌంట్లో జమచేయాలని చెప్పడంతో బాధితుడు సతీశ్ ఆ డబ్బులు వాల్టా అకౌంట్లో వేసిన అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ బషీర్ అలీఖాన్పై వచ్చిన ఫిర్యాదుతో మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. ముందుగా ఇందల్వాయి తహసీల్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు.
అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద అపార్ట్మెంట్లో ఉన్న తహసీల్దార్ రమేశ్ ఫ్లాట్లో అవినీతి నిరోధక శాఖ బృందం తనిఖీలు చేపట్టింది. డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణపై సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. తహసీల్దార్తో పాటు ఆర్ఐపై కేసులు నమోదు చేశామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
తహసీల్ కార్యాలయంలో..
ఇందల్వాయి, జూన్ 30: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు సభ్యుల ఏసీబీ బృందం సీఐ వెంకట్రాజాగౌడ్, మెదక్ రేంజ్ ఆఫీసర్ నేతృత్వంలో సోదాలు నిర్వహించింది. కార్యాలయానికి వెళ్లిన వెంటనే సిబ్బంది వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకొని స్విచ్చాఫ్ చేశారు. అనంతరం కార్యాలయం గేటు, తలుపులను మూసివేసి రికార్డులను పరిశీలించారు. సాయంత్రం 6.30 గంటల వరకు రికార్డులను పరిశీలించారు.