Rythu bandhu | కామారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ):ఉమ్మడి రాష్ట్రంలో సాగు సంక్షోభంలో చిక్కుకుపోయింది. సమైక్య పాలకుల పక్షపాత వైఖరితో తెలంగాణ రైతాంగం ఆగమైంది. నీళ్లు, కరెంటు లేక, పంట నష్టాలు తట్టుకోలేక రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది. అయితే, తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్.. అన్నదాతలకు అండగా నిలిచారు. తొలుత నీళ్లతో పాటు కరెంటు సమస్యను తీర్చారు. పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న తిప్పలతో పాటు అప్పుల పాలవుతున్న దుస్థితిని గమనించి ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. అదే ‘రైతుబంధు’. దేశమే ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దిన ఈ పథకానికి తాజాగా ఐదేండ్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా రెండు సీజన్లలో అందిస్తున్నది. ఈ ఐదేండ్లలో రైతుబంధు పథకం కింద ఒక్క కామారెడ్డి జిల్లాలోని రైతంగానికి రూ.2,289 కోట్ల లబ్ధి చేకూరింది. కేసీఆర్ చొరవతో 24 గంటల ఉచిత కరెంట్, దండిగా నీళ్లు, పెట్టుబడి సాయంతో ఎవుసం పండుగలా మారింది. దండిగా వస్తున్న దిగుబడులను చూసి రైతాంగం మురిసి పోతున్నది.
వానకాలం, యాసంగి పంటల సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు పెట్టుబడి కోసం శావుకార్లు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ, తమ వద్ద ఉన్న వెండి, బంగారాన్ని తాకట్టు పెడుతూ అష్టకష్టాల పాలయ్యేవారు. పంటలు సరిగా పండక, చేసిన అప్పులను తీర్చలేక వడ్డీ భారంతో కుంగిపోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వేల కోట్ల భారమైనప్పటికీ భరిస్తూ రైతుల కో సం తీసుకువచ్చిన పథకమే ‘రైతు బంధు’ పథకం. ఈ పథకం ఐదేండ్ల క్రితం అంటే 2018 మే 10న ప్రారంభించారు. ఐదేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా, జిల్లాలో రైతు బంధు అమలు తీరుపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
సమైక్య రాష్ట్రంలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయంలో నష్టాలను చవిచూస్తూ ఆత్మహత్యలు చేసుకొన్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయి. రై తుల ఆత్మహత్యలను నివారించడంలో అప్పటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తన కేబినెట్లో రైతు బిడ్డ అయిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించి, రైతుల కష్టాలను తీర్చడానికి చేపట్టాల్సిన సంక్షేమ పథకాల గురించి చర్చించారు.
అప్పటి వ్యవసాయ మంత్రి గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను కళ్లారా చూసి, వారికి ఏ రకంగా సహాయం అందిస్తే ఆసరా లభిస్తుందనే కోణంలో ఆలోచించి ప్రవేశపెట్టిన పథకాల్లో రైతుబంధు పథకం ముఖ్యమైనది. రైతుల సంక్షేమా ర్థం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయం, రైతు కుటుంబానికి అండగా ఉండేందుకు బీమా పథకం ప్రవేశపెట్టారు. 2018 మే 10న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. మొదటి రెండేండ్లు ఎకరానికి 4వేల చొప్పున ఆర్థిక సహాయం అందించగా, ఆ తర్వాత మరో వెయ్యి రూపాయలు పెంచి ఎకరానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని, వానకాలం, యాసంగి సీజన్లలో అందజేస్తున్నారు.
రైతుల ఖాతాల్లో 2,289 కోట్లు
జిల్లాలో గత ఐదేండ్లలో రైతుల ఖాతాల్లో పది సీజన్లకు గాను రూ.2,289 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 2018లో వానకాలంలో జిల్లాలోని 2,07,385 రైతుల ఖాతాల్లో రూ.177.38 కోట్లను జమ చేయగా, 2022 యాసంగిలో 2,79,384 మంది రైతుల ఖాతాల్లో 252.76 కోట్లు జమ చేయడం గమనార్హం. అంటే ఐదేండ్ల లో రైతుల సంఖ్య 71,999కు పెరగగా, రైతుబంధు నిధులు రూ.75కోట్లకు పెరిగాయి. ఏటేటా రైతుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడి సహా యం పెరుగుతున్నది. సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు పెట్టుబడి సహాయం కోసం వడ్డీ వ్యాపారుల వద్ద వెళ్లాల్సిన పరిస్థితి లేదు. గత యాసంగిలో జిల్లాలో యాసంగిలో 4,14,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. వీటిలో వరి పంటను 2.59లక్షల ఎకరాల్లో, లక్ష ఎకరాల్లో శనగ, 55 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయడం గమనార్హం.
వ్యవసాయంపై పెరుగుతున్న మక్కువ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో వ్యవసాయరంగం దినదినాభివృద్ధి చెందుతున్నది. సమైక్యరాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే ప్రచారం జరుగగా, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా చేశారు. పెట్టుబడి సహాయంతో పక్క రాష్ర్టాల్లోని రైతులు కూడా ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలోనే తమ ప్రాంతాలను కలపాలని ఉద్యమాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న దెగ్లూర్, బిలోలి తాలూకా ప్రాంతాల్లోని రైతులు పలుమార్లు ఆందోళనలు సైతం చేశారు. వానకాలం, యాసంగి సీజన్లలో పెట్టుబడి సహాయం అందుతుండడంతో రైతులు వరితోపాటు మక్కజొన్న, వేరుశనగ, పప్పు ధాన్యాలు, చెరుకు ఇతర రకరకాల పంటలను సాగు చేసుకొంటున్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కూడా పెరిగింది.
రైతుల కష్టాలు తీరాయి
రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన పథకం రైతుబంధు. ఈ పథకంతో రైతుల కష్టాలు తీరాయి. యాసంగి, వానకాలానికి సంబంధించి ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ అవుతున్నది. ప్రస్తుత స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి.. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఉమ్మడి జిల్లాలో ఎంతో రైతులు లబ్ధిపొందుతున్నారు. పథకానికి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు.
–దుద్దాల అంజిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
పకడ్బందీగా అమలు చేస్తున్నాం
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన రైతు బంధును జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.2,289 కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. ఇంకా కొత్తగా వ్యవసాయ భూమి కొన్నవారికి రైతుబంధు పథకం అమలు చేస్తాం. రైతులు తమ పేర్లను ఆయా మండల వ్యవసాయ అధికారులు, లేదా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తీరణ అధికారులకు అందజేయాలి. రైతు బంధుతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకోవచ్చు.
–వీరస్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, కామారెడ్డి