వరంగల్ చారిత్రక విశిష్టత తెలిపేలా డిజైన్
రూ.6 కోట్లతో మొదలైన పనులు..
రూ.19.50 కోట్లతో వంద ఫీట్ల రోడ్లు
వరంగల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరం వరంగల్కు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తరూపు తెస్తోంది. వరంగల్ చారిత్రక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేలా ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్కు వచ్చే పర్యాటకులకు నగరం విశిష్టతను కండ్లకు కట్టేలా చేస్తోంది. వరంగల్ విశిష్టత అందరికీ తెలిసేలా.. నగరానికి ఐదు వైపులా స్వాగత తోరణాల(గ్రాండ్ ఎంట్రెన్స్)ను నిర్మిస్తోంది. కాకతీయుల రాజధానిగా ప్రసిద్ధిచెందిన వరంగల్ నగరానికి కొత్త కట్టడాలతో మరింత శోభ రానుంది. రూ.6 కోట్లతో నగరం ఐదు దిక్కులా స్వాగత తోరణాలను నిర్మిస్తున్నారు. ప్రతి స్వాగత తోరణానికి ఒక్కో విశిష్టత సంతరించుకునేలా డిజైన్ చేశారు. 30ఫీట్ల వెడల్పుతో వీటిని నిర్మిస్తున్నారు. స్వాగత తోరణాల వద్దకు రాగానే వరంగల్ నగరంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి వచ్చేలా వీటి వద్ద కిలోమీటర్ పొడవునా వంద ఫీట్ల రోడ్డు నిర్మిస్తున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, నర్సంపేట, ఖమ్మం రహదారులపై నిర్మించనున్న స్వాగత తోరణాల డిజైన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. స్వాగత తోరణాల నిర్మాణానికి అనుగుణంగా రోడ్డు వెడల్పు పనులు పూర్తి కావస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వరంగల్ నగరానికి వచ్చే ఐదు రహదారుల్లో నగరంలోకి అడుగుపెట్టే ప్రాంతంలో స్వాగత తోరణాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చే రహదారిలో రాంపూర్లోని ఆక్సిజన్ పార్క్ వద్ద, కరీంనగర్ వైపు నుంచి వచ్చే రహదారిలో ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద, ములుగు నుంచి వచ్చే రహదారిపై ఆరెపల్లి బ్రిడ్జి వద్ద, నర్సంపేట రహదారిపై గొర్రెకుంట వద్ద, ఖమ్మం రహదారిపై బొల్లికుంట వద్ద గ్రాండ్ స్వాగత తోరణాలను నిర్మిస్తున్నారు.
నగర విశిష్టతను తెలిపేలా డిజైన్లు..
ఐదు వైపులా నిర్మిస్తున్న స్వాగత తోరణాలు వరంగల్ చారిత్రక విశిష్టతలను తెలిపేలా డిజైన్లు చేశారు. హైదరాబాద్, ఖమ్మం రోడ్డుపై బొల్లికుంట వద్ద నిర్మించనున్న స్వాగత తోరణాలు ఒకే డిజైన్లో రూపొందించారు. కాకతీయుల శిల్పకళ ప్రతిబించేలా వీటిని నిర్మించనున్నారు. కాకతీయుల హయాంలో శిల్పాలపై చెక్కిన డిజైన్లతో రహదారికి ఇరుపైపులా అధిరోహణ, అవరోహణ క్రమంలో ఫిల్లర్స్ను ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ రహదారిపై చదువు గొప్పదనం(ఎడ్యుకేషన్ థీమ్) తెలిపేలా స్వాగతతోరణం డిజైన్ చేశారు. రోడ్డు మధ్యలో ఫిల్లర్పై తెరిచిన పుస్తకం బొమ్మ, పక్కన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఉండేలా డిజైన్ చేశారు. రహదారి రెండు వైపులా ‘వెల్కమ్ టు వరంగల్’ పేరుతో రెండు ఫిల్లర్ను నిర్మించనున్నారు. ములుగు రహదారిలో కల్చరల్ ధీమ్తో స్వాగత తోరణం రూపకల్పన చేశారు. దేశంలో అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ నిర్మాణం అవుతున్న ప్రాంతం కావడంతో దాని విశిష్టతను తెలిపేలా నర్సంపేట రహదారి గొర్రెకుంట వద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోగో, మగ్గం ఉండేలా స్వాగత తోరణం డిజైన్ చేశారు. ఆరెపల్లి వద్ద గిరిజన సంస్కృతిని చాటి చెప్పేలా స్వాగత తోరణాన్ని నిర్మించనున్నారు. రూ.6కోట్లతో స్వాగత తోరణాలు నిర్మిస్తున్నారు.
రాంపూర్, బొల్లికుంట స్వాగత తోరణాలకు రూ.1.99 కోట్లు చొప్పున కేటాయించారు. గొర్రెకుంట వద్ద రూ.1.14 కోట్లు, ఎల్లాపూర్ వద్ద రూ.88 లక్షలతో గ్రాండ్ ఎంట్రెన్స్లు నిర్మిస్తున్నారు. ములుగు రోడ్డు రహదారిలోని కోటి రూపాయలుగా అంచనా వేశారు. ఐదు స్వాగత తోరణాలు జంక్షన్ల తరహాలో అభివృద్ధి కానున్నాయి. ఇక్కడ రహదారులు మరింత విశాలంగా ఉండేలా కిలోమీటర్ పొడవుతో వంద ఫీట్ల రోడ్లను నిర్మించనున్నారు. రూ.19.50 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం హామీ నిధులతో ఈ పనులు చేపట్టారు. వంద ఫీట్ల రోడ్డు మధ్యలో గ్రీనరీ, అందమైన పూల వనాలు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు స్వాగత తోరణాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన అధికారులు వాటిలో వేగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.సీఎం హమీ నిధులతో చేపట్టిన స్వాగత తోరణాలు నగరానికి కంఠాభరణాలుగా నిలిచి కొత్త సొగబులు అద్దనున్నాయి.