నిజామాబాద్, డిసెంబర్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి కామారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు రూ.వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా కామారెడ్డి నిలిచింది. రెండో స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచింది. ఇక్కడ రూ.922 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 90శాతం చెల్లింపులు సైతం చకచకా పూర్తి చేయడం ద్వారా గతం మాదిరిగానే ఈసారి కూడా ఉభయ జిల్లాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన 32 జిల్లాలతో పోలిస్తే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఉభయ జిల్లాలు ముందంజలో నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు మరోసారి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. వాస్తవానికి ధాన్యం సేకరణ ప్రక్రియ చాలా క్లిష్టమైంది. రైతుల నుంచి పంట దిగుబడులను సేకరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు అనేకం. ఇందులో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థలతో పాటు వ్యవసాయ, సహకార, రవాణా, రెవెన్యూ, పోలీసు శాఖలు సైతం కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉమ్మడిగా ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పని చేస్తేనే ప్రక్రియ అన్నది విజయవంతం అవుతుంది. ఈ సీజన్లో అకాల వర్షాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగినప్పటికీ రైతులకు ఇక్కట్లు తలెత్తకుండా ధాన్యాన్ని సేకరించారు.
వానాకాలం 2023 సీజన్లో ధాన్యం సేకరణకు అసెంబ్లీ ఎన్నికలు కాసింత ప్రతిబంధకంగా నిలిచినప్పటికీ విజయవంతంగా ప్రక్రియ చేపట్టడం మెప్పు పొందుతున్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొదటి వారమంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. చెల్లింపుల్లో ఇక్కట్లు లేకుండా ఉండేందుకు ముందస్తుగానే డబ్బుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నది. తద్వారా రైతుల ప్రయోజనాలను గత కేసీఆర్ సర్కారు కాపాడేందుకు కృషి చేసింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల హడావుడిలో కొట్టుమిట్టాడినా పూర్తి స్థాయి సమన్వయంతో రవాణా, రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, సహకార శాఖలు, ఐకేపీలు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాయి. వారం రోజుల్లోనే ధాన్యం అమ్ముకున్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేయడం ద్వారా రైతన్నలంతా సంతోషిస్తున్నారు.
రైతుల వద్దకెళ్లి పంట దిగుబడిని సేకరించాం. ఎక్కడ అవసరమైతే అక్కడ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా ఎవరికీ ఇబ్బంది కలగలేదు. మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి సమస్యల్లేకుండా సాంకేతికత సహకారంతో పూర్తి చేశాం. సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలు పనికొచ్చాయి. నిజామాబాద్లో వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ విజయవంతం కావడం ఆనందంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల సిబ్బందికి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అహర్నిశలు పని చేశారు. తద్వారానే ధాన్యం సేకరణలో ముందంజలో నిలిచాం.
– అభిషేక్ సింగ్, కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
సేకరణలో కామారెడ్డి టాప్…
ఎప్పటిలాగే కామారెడ్డి జిల్లానే ధాన్యం సేకరణలో టాప్లో నిలిచింది. రాష్ట్రంలోనే అత్యధిక వేగంగా ప్రక్రియను పూర్తి చేసి ముందు వరుసలో నిలిచింది. కామారెడ్డి నంబర్ వన్గా, నిజామాబాద్ 2వ స్థానంలో నిలిచాయి. కామారెడ్డి జిల్లాలో 6లక్షల 50వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. 350 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా 349 ప్రారంభించగా ఇప్పటికే 328 మూసేశారు. 4లక్షల 69వేల 232 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 78,810 మంది రైతుల నుంచి మొత్తం రూ.1002.91కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించారు. ఇందులో రూ.962.46కోట్లు చెల్లింపులు పూర్తవ్వగా కేవలం రూ.40.45 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 458 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించి 440 కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే కొనుగోళ్ల ప్రక్రియ ముగియడంతో 412 కేంద్రాలను మూసేశారు. మిగిలిన చోట్ల అక్కడక్కడా మిగిలి పోయిన ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రాలను అందుబాటులో ఉంచారు. పౌరసరఫరాల సంస్థ తాజా గణాంకాల మేరకు నిజామాబాద్ జిల్లాలో 5లక్షల 95వేల 345 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించారు. 64,697 మంది రైతుల నుంచి రూ.922కోట్లు విలువ చేసే ధాన్యం సేకరణ పూర్తయ్యింది. ఇందులో రూ.910 కోట్లు చెల్లింపులు సైతం పూర్తి చేశారు. ఇంకా రూ.11.94కోట్లు మాత్రమే పెండింగ్లో ఉంది.