ఖలీల్వాడి, మే 21 : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీఎస్ ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. మరో వైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. నిజామాబాద్ జిల్లాకు త్వరలో 85 ఈ -బస్సులు రానున్నాయి. వీటిని నిజామాబాద్-హైదరాబాద్, నిజామాబాద్-కరీంనగర్, వరంగల్ రూట్లలో నడపన్నారు. దీంతో డీజిల్ వాడకంతో ఏర్పడే వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణికులకు సురక్షిత, సుఖవంతమైన ప్రయాణ అనుభూతి కలుగనున్నది.
రాష్ట్ర సర్కారు ఆర్టీసీ దిశ దశను మారుస్తున్నది. సంస్థలో ఎప్పటికప్పుడు నూతనోత్సాహాన్ని నింపుతున్నది. రోజుకో కొత్త పథకాన్ని తీసుకువస్తూ ప్రయాణికులకు ప్రయోజనాలు, కార్మికులకు భరోసాను కలిగిస్తున్నది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారనే విమర్శలను తిప్పికొట్టి లాభాల బాటలోకి తెస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీలో పనిచేస్తున్న కార్మికులకు భద్రతతోపాటు అండగా ఉంటున్నది. ప్రయాణికులకు రాయితీ కల్పించేందుకు వివిధ పథకాలను తీసుకువస్తున్నారు. డొక్కు బస్సుల స్థానంలో కొత్త సర్వీసులను ఆందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చి చేరడం గమనార్హం.
ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీగా సజ్జనార్ను నియమించినప్పటి నుంచి ఆర్టీసీలో నూతనోత్సాహం కనిపిస్తున్నది. సరికొత్త పథకాలతోపాటు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లను ఆధునీకరించి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు బస్సు రూట్లు, ట్రిప్పులను పెంచారు. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరేలా కార్గో పర్సిల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులను ఆకర్శించేందుకు కొత్త కొత్త పథకాలను తీసుకువస్తున్నారు. మాతృదినోత్సవం, బాలల దినోత్సవం రోజున ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ప్రజల మన్ననలు పొందారు. ఆర్టీసీ అంటేనే సురక్షితం అనే నినాదంతో అవగాహన సదస్సులు పెట్టి సంస్థను ప్రజలు ఆదరించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
కొత్త బస్సు సర్వీసులు..
ప్రైవేటు ట్రావెల్స్కు దీటుగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం అన్ని హంగులతో బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. సుఖవంతంగా ప్రయాణించేలా రాజధాని, సూపర్ లగ్జరీ, గరుడ వంటి సర్వీసులను ఇప్పటికే నడిపిస్తున్నారు. కాలుష్యం, ఇంధన భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ సంస్థలోకి తాజాగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చారు. ఈ బస్సులు ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభం కాగా, నిజామాబాద్ డిపోకు త్వరలో రానున్నాయి.
బాజిరెడ్డి ప్రత్యేక చొరవ..
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టాలను చవిచూసిన ఆర్టీసీని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అమ్మేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఆర్టీసీని ముందుకు నడిపించాలని సిద్ధమైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంస్థ బాధ్యతలను బాజిరెడ్డి గోవర్ధన్కు అప్పటించారు. అప్పటి నుంచి టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషి చేస్తున్నారు. అటు ఉద్యోగులు, ఇటు కార్మికులతో మమేకమవుతూ సంస్థలో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. కార్మికుల సంక్షేమంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా సంస్థను లాభాల బాటలోకి తెచ్చి కార్మికులకు, ప్రజా రవాణాకు భరోసా కల్పించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకొని నిజామాబాద్ నగరంలో సిటీ బస్సులను కూడా ప్రారంభించారు.
జిల్లాకు రానున్న 85 ఎలక్ట్రిక్ బస్సులు..
పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. నిత్యం తిరిగే వాహనాల నుంచి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రజారవాణాలో భాగమైన ఆర్టీసీలోనూ ఎలక్ట్రిక్ వాహనలను పెద్దసంఖ్యలో ప్రవేశపెట్టారు. ఈ బస్సులు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లో రోడ్డెక్కాయి. నిజామాబాద్ జిల్లాకూ 85 బస్సులు రానున్నట్లు సమాచారం. ఇవి నిజామాబాద్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ రూట్లలో తిరుగనున్నాయి.
ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యం
సీఎం కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. నష్టాల బాటలో ఉన్న సంస్థ లాభాల వైపు పయనిస్తున్నది. దీంతో ప్రజలు, కార్మికుల్లో నమ్మకం కలిగింది. ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ద్వారా అనేక సేవలను అందిస్తున్నాం. ప్రయాణికులను ఆకర్శించే పథకాలు, రాయితీలు అందిస్తున్నాం. పాత బస్సుల స్థానంలో కొత్త సర్వీసులను తీసుకువస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. డైవర్లుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
–బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, చైర్మన్, టీఎస్ఆర్టీసీ
త్వరలోనే జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సులు
నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో రానున్నాయి. ఆర్టీసీ అభివృద్ధికి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆర్టిసీకి పూర్వవైభవంతోపాటు నూతన టెక్నాలజీతో బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
–ఉషాదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నిజామాబాద్