కామారెడ్డి, సెప్టెంంబర్ 27 : గులాబ్ తుపాన్ ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కలెక్టర్తో పాటు రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు సమీప ప్రాంతాల చెరువులు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిపోయాయి. వరి, మక్కజొన్న తదితర పంటలు నీటమునుగుతుండడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. కామారెడ్డి మండల పరిధిలోని కన్నాపూర్-గర్గుల్ వాగు ఉధృతంగా పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అడ్లూర్ ఎల్లారెడ్డి-అడ్లూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సింగూరు జలాలు వస్తుండడంతో నాగిరెడ్డిపేట మండలంలో ఏడు గ్రామాల్లో 300 ఎకరాల వరి పంట నీట మునిగింది. మరో రెండు రోజుల పాటు తుపాన్ ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూ చించారు. వాతావారణ శాఖ సలహాలు, సూచనలను పాటించాలని ఎస్పీ శ్వేతారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. చేపలు పట్టేందుకు, పశువులు మేపేందుకు డ్యాములు, చెరువులు, వాగులు, కాలువల ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పురాతన ఇండ్లు, గుడిసెలు కూలే అవకాశం ఉన్నందున తగ్గుముఖం పట్టే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.