నిర్మల్ టౌన్, జనవరి 20 : ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక నిధులను కేటాయించడమే కాకుండా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ)ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ. 3కోట్ల చొప్పున, మంత్రి కోటాలో రూ. 5కోట్లు ప్రకటించింది. ఇందులో 50 శాతం నిధులను ఇప్పటికే విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలకు రూ.27కోట్లు, ఎమ్మెల్సీ కోటా కింద రూ. 9కోట్లు, మంత్రి కోటా కింద రూ. 5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధుల్లో 40శాతం నిధులను పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకే ఖర్చు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల ద్వారా పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి నివేదించనున్నారు.
మెరుగుపడనున్న సౌకర్యాలు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 3325 పాఠశాలలుండగా, అందులో 2413 ప్రాథమిక, 470 ప్రాథమికొన్నత, 442 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో చదువుతున్నట్లు పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా వచ్చే నిధులతో 12 రకాల సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్బోర్డులు, ప్రహారి, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి, డిజిటల్ విద్య, క్రీడా పరికరాలు వంటి వాటికి ఈ నిధులు వినియోగించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
న్యూపోచంపాడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 110 మంది విద్యార్థులు చదువుతుండగా, తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం పది గదులు మాత్రమే ఉన్నాయి. ఏసీడీపీ ద్వారా ఈ పాఠశాలకు అదనపు గదులను ఇవ్వాలని మంత్రికి ఇటీవల గ్రామస్తులు విన్నవించారు. త్వరలోనే మంజూరు చేస్తానని మంత్రి హామీనిచ్చారు.
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలలో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత లేనప్పటికీ ప్రహారీ లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు నిలుపుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు నాశనమవుతున్నాయి. దీంతో ప్రహరీ కావాలని ఇటీవలే ఎమ్మెల్యే విఠల్రెడ్డికి విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా రూ.2.50లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం. కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయలు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మన ఊరు మన బడి కింద నిధులను మంజూరు చేయడం, ఎమ్మెల్యే కోటా కింద ఏసీడీపీ నిధుల్లో 40 శాతం ప్రభుత్వ పాఠశాలలకే కేటాయించడం అభినందనీయం.
మంచి విద్యను అందిస్తున్నారు..
మాది నిర్మల్ మండలంలోని చిట్యాల్ జడ్పీహెచ్ఎస్. 8వ తరగతి చదువుతున్న. మాది పేద కుటుంబం కావడంతో ప్రైవేటులో చదివించే పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, విద్యాబోధన చేయడం, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు అందించడంతో మంచిగా చదువుకుంటున్నం. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలున్నయి.
-ఎస్కే రియాజ్, చిట్యాల్
సర్కారు విద్యే మంచిగుంటున్నది..
సర్కారు బడిలోనే విద్యార్థులకు బలమైన విద్య అందుతోంది. ఎన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు వచ్చినా, ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటరు. విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి చదువు చెప్పేది ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే. మన ఊరు- మన బడి ద్వారా స్కూళ్లను ఆధునికరించాలని సర్కారు తీసుకున్న నిర్ణయం బాగుంది.
– బక్కన్న, యూటీఎఫ్ నాయకుడు
బడి బాగు నిర్ణయం హర్షణీయం..
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.7289 కోట్లు కేటాయించడం హర్షనీయం. విద్యార్థులందరూ పేదవారే కావడంతో ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అద్భుతాలు జరుగుతాయి. నాణ్యమైన విద్య అందితే ఇక్కడి పిల్లలు వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులుగా మరింత కష్టపడి పనిచేస్తాం.
-పద్మ, జడ్పీహెచ్ఎస్, మంజులాపూర్