అభివృద్ధి మాంత్రికులను విమర్శించే అర్హత నీకు లేదు
విలేకరుల సమావేశంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
నిర్మల్ అర్బన్, జూలై 14 : సంక్షేమ పథకాలతో అటు రాష్ర్టాన్ని, ఇటు నిర్మల్ జిల్లాను సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని, దానిని ఓర్వలేకనే వారిపై విమర్శించడం మీ స్థాయికి తగదని, ఓటుకు నోటు కేసులో మీరే ఓ గజదొంగని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలోని ఎమెల్యే క్యాంపు కార్యాలయంలో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని స్థానిక నేతలు ఇచ్చిన స్క్రిప్టును మాట్లాడారని తెలిపారు. దేశాన్ని, రాష్ర్టాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని, తన ఉనికి చాటుకునేందుకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలిపారు.
పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే నిర్మల్ ప్రజలు ఊరుకోబోరని, కొడంగల్లో పట్టిన గతే పట్టిస్తారని హెచ్చరించారు. మచ్చలేని మనిషి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ను ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. మంత్రి రాజకీయ వయస్సులో మీ వయసెంత? పూటకో రంగు మార్చే మీ చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. మంత్రి, మంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలను రుజువు చేస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. సండే ఎమ్మెల్యేగా పేరుపడ్డ ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కావడం లేదన్నారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, సంపంగి రవి, పూదరి రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.