Entrepreneur | పర్యావరణం బాగుంటేనే మనిషి బాగుంటాడు. ప్రపంచమూ పచ్చగా ఉంటుంది. పర్యావరణానికి హాని జరగకూడదంటే.. ప్రత్యామ్నాయ వనరులు సృష్టించుకోవాలి. కొందరు యువకులు ఆ బాధ్యతను తీసుకున్నారు. వ్యర్థాలతో కాగితం, కాలుష్యాన్ని సృష్టించని సైకిల్, కార్డ్బోర్డ్ ఫర్నిచర్.. ఆవిష్కరించి ప్రపంచానికి అందిస్తున్నారు.
ఇంట్లో, ఆఫీసులో స్టీల్, ప్లాస్టిక్, చెక్క స్టాండ్స్, షెల్ఫులు వాడుతుంటాం. కానీ వాటి ధర ఆకాశాన్ని అంటుతున్నది. మధ్యతరగతికి అదో ఖరీదైన వ్యవహారమే. ‘చవకైన ఫర్నిచర్ అందించలేమా’ అని ఆలోచించాడు చెన్నైకి చెందిన కార్తీక్. పుణెలోని ‘ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్’ నుంచి ప్రొడక్ట్ డిజైన్లో మాస్టర్స్ చదివిన కార్తీక్.. విద్యార్థిగా ఉన్నప్పుడు బట్టలు, పుస్తకాలు భద్రపరుచుకోవడానికి ఇబ్బంది పడేవాడు తను. ఆర్నెల్లపాటు కార్డ్బోర్డ్ ఫర్నిచర్పై అధ్యయనం చేశాడు. కొవిడ్ ఫస్ట్వేవ్లో శానిటైజర్ స్టాండ్లకు పెరుగుతున్న గిరాకీని గుర్తించి కార్డ్బోర్డ్ స్టాండ్ల తయారీపై దృష్టి పెట్టాడు. అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రపంచ నలుమూలల నుంచి ఆర్డర్లు రావడంతో లైసెన్స్ తీసుకున్నాడు. కొవిడ్ ప్రభావం తగ్గిపోయి శానిటైజర్ స్టాండ్లకు డిమాండ్ కూడా తగ్గిపోవడంతో.. మిగతా ఎకో-ఫ్రెండ్లీ ఫర్నిచర్ తయారీ మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలో ‘అవుట్ ఆఫ్ ద బాక్స్’ స్టార్టప్ను ప్రారంభించాడు. ఐకియాకు పోటీగా నిలుస్తున్నదీ సంస్థ.
ఇప్పటి వరకూ, మనకు కాగితం వెదురు నుంచి వస్తుందనే తెలుసు. కానీ, ‘ఎన్ని చెట్లని నరుక్కుంటూ వెళ్తాం? ఏదో ఓ ప్రత్యామ్నాయం ఉండాలి కదా!’ అని ఆలోచించింది కర్ణాటకకు చెందిన కావ్య మాదప్ప. తన స్టార్టప్ ద్వారా వ్యర్థాల నుంచి పేపర్ను తయారుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. కూర్గ్లో పచ్చదనం మధ్య పెరిగిన కావ్య మాదప్పకు ప్రకృతి అంటే ప్రాణం. కానీ పర్యావరణానికి జరుగుతున్న హాని ఆమెను కలవరపెట్టింది. ఏటా కాగితం తయారీకి లక్షలకొద్దీ చెట్లు నరికేస్తున్న తీరు బాధపెట్టింది. దీనికి పరిష్కారంగా ‘బ్లూక్యాట్ పేపర్’ అనే స్టార్టప్ను ప్రారంభించింది. దీనిద్వారా పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ట్రీ-ఫ్రీ పేపర్ను తయారుచేస్తున్నది. ఇందులో వస్త్ర పరిశ్రమల వ్యర్థాలు, నార, అవిసె, జనపనార, లెమన్గ్రాస్, మల్బరీ బెరడు, వరిపొట్టు, కాఫీ పొట్టు, అరటి నార, ఏనుగు పేడ వంటివెన్నో ఉపయోగిస్తుంది. బ్లూక్యాట్ పేపర్ ఉత్పత్తులను స్టేషనరీ మొదలుకొని అలంకరణ వరకు అన్నిట్లోనూ ఉపయోగించుకోవచ్చు. తన స్టార్టప్ వల్ల నెలకు సుమారు 30 టన్నుల కలప, రోజూ 30 వేల లీటర్ల నీరు ఆదా అవుతున్నట్టు కావ్య వెల్లడించింది.
ట్రాఫిక్లో ఇరుక్కుంటే మన బతుకు బస్టాండే. మన బైక్ను మడత పెట్టుకొని నడిచి వెళ్లే అవకాశం ఉంటే బావుండేది కదా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అచ్చంగా అలాంటి ఓ ఫోల్డెడ్ ఈ- సైకిల్ను రూపొందించారు హైదరాబాదీ యువకులు. దీన్ని ‘కచ్బో డిజైన్స్’ అనే స్టార్టప్ ద్వారా రూపొందించారు నిషిత్ ప్రైఖ్, రాజ్కుమార్ కేవత్. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చేతులమీదుగా దీనిని ఆవిష్కరింపజేశారు. ఈ ఎకో-ఫ్రెండ్లీ సైకిల్ హైదరాబాద్ రోడ్లపై సునాయాసంగా తిరగగలదు. దీని బ్యాటరీని సులభంగా మార్చుకోవచ్చు. మడతపెట్టే అవకాశం ఉండటంతో పార్కింగ్ సమస్య కూడా ఉండదు.
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
“Pixies curtis | పదేళ్ల వయస్సులోనే నెలకు రూ.కోటి సంపాదిస్తున్న పాప!”
Start up Plans | ఒక్క ఆలోచన కోట్లు కుమ్మరిస్తున్నాయ్!!”
“Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”