Chai Business | వాళ్లంతా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పట్టభద్రులు. సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉద్యోగాలు చేయాల్సినవాళ్లు. కానీ కొలువులను కాదనుకుని, మంచి సెంటర్ చూసుకొని ‘చాయ్ బిజినెస్’ ప్రారంభించారు. అంత చదువు చదివింది ‘టీ అమ్ముకోవడానికా ఏమిటి?’ అన్న విమర్శనూ పట్టించుకోలేదు.
చాయ్ ఒకప్పుడు ఒకే ఫ్లేవర్లో ఉండేది. ఇప్పుడు రకరకాల రుచులలో దొరుకుతున్నది. ప్రజల రుచీ అభిరుచీ తెలుసుకొని, వాళ్లకేం కావాలో అదే అందిస్తున్నారు గ్రాడ్యుయేట్ చాయ్
వాలాలు. వాళ్లకు బిజినెస్ తెలుసు, జనానికి ఏం కావాలన్నదీ తెలుసు. ఒకటిరెండు స్టాల్స్కు పరిమితం కాకుండా.. ఫ్రాంచైజీలూ ఆఫర్ చేస్తున్నారు. ‘బీటెక్ చాయ్’, ‘చాయ్ పాయింట్’, ‘ఎంబీఏ చాయ్వాలా’, ‘చాయ్ మేకర్స్’, ‘ఎంఏ ఇంగ్లీష్ చాయ్వాలీ’ ఇలా రకరకాల పేర్లతో ఔట్లెట్స్ తెరుస్తున్నారు.
కేరళకు చెందిన ఆనంద్ అజయ్, మహ్మద్ షఫీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు. ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించిన సమయానికే కొవిడ్ సీజన్-1 వచ్చేసింది. లాక్డౌన్ కాలంలో ఇద్దరి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఉన్న కొలువులకే భరోసా లేని పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలేం చేస్తారు? అప్పుడే, బుర్రలో చాయ్ ఐడియా మెరిసింది. ఇంట్లో చెబితే ‘ఇంత చదువుకున్నది చాయ్ అమ్ముకోవడానికా?’ అని వారించారు. అయినా పట్టించుకోలేదు. నిజానికి ఇద్దరి చేతుల్లోనూ పెట్టుబడి డబ్బులేదు. షఫీ సోదరుడి దగ్గర కొంత, ఫ్రెండ్స్ దగ్గర కొంత సేకరించి తోపుడుబండి కొన్నారు. కస్టమర్లను ఆకర్షించేలా బండిని రీడిజైన్చేసి కొల్లాంలో ‘బీటెక్ చాయ్’ స్టార్టప్ను ప్రారంభించారు. తొమ్మిది సుగంధ ద్రవ్యాలు, అరుదైన మూలికలతో 70 రకాల ఫ్లేవర్స్ అందిస్తున్నారు. బీటెక్ చాయ్ ధర రూ.5 నుంచి రూ.60 వరకూ ఉంటుంది. ప్రతి ఔట్ లెట్లో రోజూ కనీసం 200-500 కప్పులు చాయ్ అమ్ముడవుతుంది.
అమర్ జైన్ ఇంజినీరింగ్ పట్టభద్రుడు. ఓ సోలార్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. జీతం బాగానే ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి. రాజీనామా ఇచ్చేసి ‘ఇంజినీర్ చాయ్వాలా’ పేరుతో వారణాసిలో అవుట్లెట్ను ప్రారంభించాడు. బనారసీ పాన్చాయ్ తన ప్రత్యేకత. పశ్చిమ బెంగాల్కు చెందిన టుక్టుకీ దాస్ అయితే.. రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిష్ చేసింది. టుక్టుకీని టీచర్గా చూడాలన్నది తల్లిదండ్రుల కోరిక. తనకు మాత్రం చాయ్ వ్యాపారం చేయాలనే ఆశ. అదే మాట చెబితే ‘నిన్ను చదివించింది ఇందుకేనా?’ అన్నారు. అయినా పట్టించుకోకుండా రైల్వేస్టేషన్ కేంద్రంగా ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ ప్రారంభించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
గణేశ్ పండిట్ 2019లో బీటెక్ పూర్తిచేశాడు. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం సంపాదించాడు. చదువుకు తగిన ఉద్యోగం అయినా, ఉద్యోగానికి తగిన జీతమైనా ఉండాలి. లేకపోతే, కొలువు చేయడమే అనవసరమని అర్థమైంది. ప్రయత్నం ఎంత చేసినా అదే జాబ్, అంతే జీతం ఉండటంతో సొంత వ్యాపారం దిశగా ఆలోచించాడు. ఠక్కున చాయ్ గుర్తుకొచ్చింది. ‘చాయ్ మేకర్స్’ బ్రాండ్తో టీస్టాల్ ప్రారంభించాడు. మిత్రుడు, కో-ఫౌండర్ ప్రదీప్ జాదవ్ సలహాతో సూరత్తో పాటు పలు పట్టణాల్లో ప్రాంచైజీలను ఏర్పాటు చేసుకున్నాడు. పదిహేడు రకాల చాయ్లు, పదమూడు రకాల కాఫీలు అందిస్తున్నాడు. ఇంత సంతృప్తి ఏ ఉద్యోగంలోనూ లేదని అంటాడు.
అములీక్ సింగ్ బిజ్రాల్ హార్వర్డ్లో చదివాడు. వెనక్కి తిరిగొచ్చి ‘చాయ్ పాయింట్’ను లాంచ్ చేశాడు. ఇండియాలో తొలి చాయ్ స్టార్టప్ ఇదే. ఆ తర్వాత ‘ఎంబీఏ చాయ్వాలా’ రంగంలోకి దిగింది. మెక్డొనాల్డ్స్ మాజీ ఉద్యోగి ప్రఫుల్ ఎంబీఏ చదివాడు. ఎనిమిదివేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. ఎంబీఏ చాయ్ వాలా టర్నోవర్ రూ. 4 కోట్లు. 25 నగరాల్లో 60 అవుట్లెట్స్ ఉన్నాయి. ‘ఎంబీఏ చాయ్వాలా అకాడమీ’ని ప్రారంభించి ఆంత్రప్రెన్యూర్షిప్లో స్పెషల్ కోర్స్ను అందిస్తున్నాడు.
Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”
కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”