అమరావతి : ఏపీలో అధికార వైసీపీ (YCP) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను (Election manifesto) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాదిరిగా అబద్దపు హామీలతో మోసాలు చేయకుండా సాధ్యమయ్యే వాటినే అమలు చేస్తామని అన్నారు.
అమ్మబడి(Amma Odi) కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచి ఇస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు భరోసా పథకం వర్తింపచేస్తామని, వైఎస్సార్ సున్నావడ్డీ కింద మహిళలకు రూ. 3లక్షల వరకు రుణాలు అందిస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్లను అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి నెలా అందిస్తున్న రూ. 3వేల పెన్షన్ (Pensions) ను రెండు విడతలుగా 2028 జనవరి , 2029 జనవరి నుంచి అందిస్తామని తెలిపారు.
మళ్లీ అధికారంలోకి రాగానే అమరావతి (Amaraati) ని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు భరోసాను 13,500 నుంచి రూ.16వేలకు పెంచుతామని జగన్ మేనిఫెస్టోలలో పొందుపర్చారు. స్విగ్గి, జొమాటో, గిగ్ వర్కర్లకు కూడా వైఎస్సార్ భీమాను వర్తింపచేస్తామని తెలిపారు.
జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ , రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా విశాఖను అభివృద్ధి చేస్తామని వివరించారు. వచ్చే ఐదేళ్లలో పోలవరం (Polavaram) ప్రాజెక్టును పూర్తి చేస్తామని, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.