డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శనివారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. ఈ సందర్భంగా కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరుకానున్నారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా ఆయనను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్ కౌశిక్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
ఇందులో తమ తదుపరి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే, సత్పాల్ రావత్, ధన్సింగ్ రావత్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్సింగ్.. శుక్రవారం రాత్రి ఆ పదవికి రాజీనామా చేశారు. రాత్రి 11 గంటల సమయంలో డెహ్రాడూన్లోని రాజ్భవన్ వద్ద గవర్నర్ బేబీ రాణిమౌర్యకు రాజీనామాపత్రాన్ని అందజేశారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఆయన రాజీనామా చేశారు.
పౌరి గర్హ్వాల్ నుంచి లోక్సభకు ఎంపిక ఆయన.. ఆరు నెలల్లోగా అంటే.. సెప్టెంబర్ 10వ వరకు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. గడువు ముగిసేవరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమ మార్గమని భావించారు. ఉత్తరాఖండ్లో రెండు శాసనసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేకపోవడంతో ఆయన రాజీనామా చేశారు.