లక్నో: ఖరీదైన బీఎండబ్ల్యూ కారుకు ‘CATCHM3’ అని నంబర్ ప్లేట్ ఉన్నది. అనుమానించిన పోలీసులు దానిని తనిఖీ చేశారు. అందులో రూ.26 లక్షల డబ్బు ఉండటం చూసి షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి లక్నోలోని స్మృతి ఉపవన్ సమీపంలో నల్లటి అద్దాలు, ‘CATCHM3’ అనే నంబర్ ప్లేట్ కలిగిన లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, ఒక స్కార్పియో ఎస్యూవీని పోలీసులు గమనించారు. ఆ వాహనాల వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు.
కాగా, ఆ వ్యక్తుల గుర్తింపు పత్రాలు, వాహనాల పత్రాలు చూపించాలని పోలీసులు కోరారు. వారు ఆ పత్రాలు చూపించలేకపోవడంతో ‘ఈ-చలాన్’ యాప్ ద్వారా వాహనాల వివరాలు చెక్ చేశారు. బీఎండబ్ల్యూ కారు శివాన్షు కుమార్ పాండే పేరు మీద, స్కార్పియో వాహనం కృష్ణ కుమార్ సింగ్ పేరు మీద రిజిస్టరైనట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు ఆ వ్యక్తులను పోలీసులు ప్రశ్నినంచగా బీఎండబ్ల్యూ కారు డిక్కీలోపలున్న లాకర్లో డబ్బు ఉన్నదని, దానిని తాము లెక్కిస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కారును సోదా చేయగా అందులో రూ.26 లక్షలు లభించాయి. రూ.500 నోట్లు ఉన్న 52 కట్టలను పోలీసులు గుర్తించారు.
అయితే ఆ డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేదా పత్రాలను ఆ వ్యక్తులు చూపించలేకపోయారు. దీంతో ఆ క్యాష్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. 21 ఏళ్ల శివాంశు పాండే, 19 ఏళ్ల రోచ్మన్ వర్మ, 21 ఏళ్ల రచిత్ ఠాకూర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బీఎండబ్ల్యూ కారులో లభించిన రూ.26 లక్షల నగదుపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.