Heavy Rains : వాయవ్య బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం (Vayugundam) గా మారింది. ప్రస్తుతం ఇది బాలాసోర్కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలో చాంద్బలి-దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది.
అనంతరం మరో 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల వైపు పయనించనుంది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ సూచన చేసింది.