Bonalu Festival | అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉంది. కొండ కోనల్లో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తనకు ఇచ్చిన పత్రి, పువ్వు, కొమ్మ, పసుపు కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను సమర్పించాడు. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణమే బోనాల వరకు వచ్చింది. పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. ఆరు వందల ఏళ్ల నాటి పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి.
15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారట. 1676లో కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మగుడిని సర్వాయి పాపన్న కట్టించి, ఆ దేవతకు బోనాలు సమర్పించినట్టు కైఫీయతుల్లో గౌడనాడులు గ్రంథంలో ఉంది. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే.. 1869లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వచ్చి ప్రబలడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
దైవాగ్రహానికి గురయ్యామని భావించిన అప్పటి ప్రజలు.. గ్రామ దేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన క్రతువే ఈ బోనాలు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హాసన్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు కూడా చరిత్రకారులు చెబుతుంటారు.
రుతుపవనాలు ప్రవేశించి వర్షా కాలం మొదలవ్వగానే మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉంది. వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా.. బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైందని అంటారు.
“గోల్కొండలో బోనాల సందడి.. చిత్రాలు”