Snapana Tirumanjanam | తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన సోమవారం వసంత మండపంలో శ్రీదేవిభూదేవి సమేతంగా మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
ఆ తర్వాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో పెద జీయర్స్వామి, చినజీయర్ స్వామి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 23న పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయ్యింది.