నల్లగొండ : నిడమనూరు మండలం వేంపాడు వద్ద సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు ఈ నెల 7న గండి పడడంతో నీటిని వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. గండి పూడ్చివేత పనులను ఎన్నెస్పీ అధికారులు వేగంగా చేపట్టి పూర్తి చేశారు. దీంతో 14 రోజుల తర్వాత మంగళవారం ఎడమ కాల్వకు నీటి విడుదలను పునరుద్ధరించారు. ఎడమ కాల్వ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గండి పూడ్చివేతను పరిశీలిస్తూ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తామని ఎన్నెస్పీ సీఈ శ్రీకాంతరావు తెలిపారు.
వేంపాడు వద్ద ఎడమ కాల్వ పనులను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ కలిసి పరిశీలించారు. గండి పూడ్చివేతకు చేపట్టిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్నెస్పీ అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.