శాయంపేట, సెప్టెంబర్ 29 : చలివాగు వరదలో గల్లంతైన కానిస్టేబుల్ రాజు మృతదేహాన్ని గురువారం గుర్తించారు. రెండు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. వంతెనకు కొంత సమీపంలో కట్టకు చిక్కుకుపోయిన రాజు విగతజీవిగా కనిపించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. దామెర పోలీస్స్టేషన్లో చెన్న రాజు పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వరంగల్ డాక్టర్స్ కాలనీలో ఉంటున్న రాజు అత్తగారి ఊరు శాయంపేట మండలం కొప్పుల గ్రామం.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొప్పులకు బైక్పై బయలు దేరినట్లు పోలీసులు తెలిపారు. కొప్పుల శివారులో వంతెనపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వాగు నుంచి వరద పోటెత్తడంతో బైక్పై వెళ్తున్న రాజు కిందపడిపోయినట్లు చెప్పారు. బైక్ను లేపుతున్న క్రమంలో వరదకు బైక్తోసహా పడిపోయి రాజు ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు వంతెన వరద నుంచి బైక్ను గుర్తించి బయటకు తీసి రాజుకు చెందినదిగా గుర్తించారు. ఎస్సై వీరభద్రరావు చేరుకుని వరదలో గాలింపు చర్యలు చేపట్టారు.
డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన రాజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి చంద్రయ్య కుమారుడు కనిపించడం లేదని శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నుంచి ఎస్సై గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వరద ప్రవాహం తగ్గడంతో కొద్ది దూరంలోనే రాజు మృతదేహాన్ని గమనించి జాలర్లు బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు.