కోజిక్కోడ్ : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూశారు. నీలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థి, మల్లప్పురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీవీ ప్రకాశ్ (56)కు గురువారం తెల్లవారు జామున ఛాతిలో నొప్పిరావడంతో ఎడక్కరాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మంజేరిలోని మరో హాస్పిటల్కు తీసుకువెళ్లినా.. ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వీవీ ప్రకాశ్ కేరళ స్టూడెంట్స్ యూనియన్ నుంచి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయికి ఎదిగారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీలంబూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎల్డీఎఫ్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థి అన్వర్పై కాంగ్రెస్ ప్రకాశ్ను బరిలోకి దింపింది. ఇదిలా ఉండగా.. ప్రకాశ్ మృతిపై కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. పార్టీలో నిజాయితీతో కూడిన వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ప్రజలకు సహాయం అందించడంలో ముందుండేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్, విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితలా సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.