హైదరాబాద్: రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై గురిపెట్టిన బీజేపీ (BJP).. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అటుఇటుగా సగం మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి టికెట్ నుంచి బీఆర్ఎస్ మాజీ నేతకే ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్థిగా గోమా శ్రీనివాస్ను పార్టీ ప్రకటించింది. అయితే నామినేషన్లకు చివరి రోజు.. మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తున్నప్పటికీ ఆయనకు ఇప్పటికీ బీఫామ్ ఇవ్వకపోవడంతో అనుమానం వ్యక్తమవుతున్నది. ఆయన స్థానంలో పెద్దపల్లి ప్రస్తుత ఎంపీని బరిలోకి దించనున్నట్లు సమాచారం.
ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో భేటీ అయ్యారు. పెద్దపల్లి లోక్సభ టికెట్ ఇస్తే తాను పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తున్నది. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి చెబుతానని ఆయనతో కిషన్రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయమై మరికాసేపట్లో స్పష్టత రానుంది.
కాగా, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేశ్.. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే ఎంపీ టికెట్ను ఆయనకు కాకుండా ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ప్రకటించింది. దీంతో అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారి అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్లాన్చేస్తున్నారు.