ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న పిటిషన్పై కౌంటర్ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకి నోటు కేసు విచారణ మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు.
న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్లు ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆ సమయంలో ఆదేశించింది. కాగా, విచారణ సందర్భంగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ కు మాత్రమే ఎందుకు మార్చాలని పిటిషనర్ల తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.