Power Cuts | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ప్రముఖులు శనివారం కరెంటు కోతల ప్రభావానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి సీతక్క, మాజీమంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో పవర్కట్ కావటం గమనార్హం. వీరు ప్రముఖులు కాబట్టి విద్యుత్తు కోతల విషయం బయటపడింది. ‘తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట కిందట మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంట్ పోవటం లేదని ఉదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారివారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంట్ పోతున్నదని నాకు చెప్పారు. రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి. జై తెలంగాణ’ అని కరెంటు కోతల పరిస్థితిపై కేసీఆర్ ట్వీట్ చేశారు.
కరెంటు కోతలపై అంతర్గత వైరింగ్ లోపం అని చెప్తూ ప్రభుత్వం తప్పించుకొంటున్నది. అదిగో కోతలంటూ వీడియోలు బయటికి రా గానే, ఇదిగో వివరణ అంటూ ఓ పత్రిక ప్రకటనను విడుదల చేస్తున్నది. ఏమన్నా అంటే.. తాము కరెంటు కోతలు విధించటం లేదు.. అంతర్గత వైరింగ్ సమస్యేనని చెప్పి చేతులు దులుపుకొంటున్నది. అందుకు గతంలో ఇచ్చిన వివరణలే అందుకు నిదర్శనం.
మాజీమంత్రి మల్లారెడ్డి సమావేశంలో విద్యుత్తు కోతలపై విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. శనివారం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఒక హోటల్లోని బంకెట్హాల్లో నిర్వహించారు. వేదికపై మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మాజీమంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీనిపై స్థానిక విద్యుత్తుశాఖ సిబ్బంది ఒకరు స్పందించారు. బంకెట్ హాలుకు విద్యుత్తు సరఫరా అందించే ట్రాన్స్ఫార్మర్ వద్ద లోడ్ పెరగటంతో దాన్ని తగ్గించేందుకు ఒక లైన్కు విద్యుత్తు సరఫరా నిలిపివేశామని వెల్లడించారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనేలేవు. ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవటం లేదు. కోతలున్నాయన్నది పూర్తిగా అబద్ధం. ఔట్డేటెడ్ టెక్నాలజీలో భద్రాద్రి ప్రాజెక్టును చేపట్టారు. ఎంత ఖర్చుఅయినా సరే కరెంట్ కొనుగోలు చేసి 24 గంటల కరెంట్ ఇస్తాం. ఎంత పవర్ డిమాండ్ పెరిగినా కరెంట్ ఇచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్తు ఉత్పత్తి పెరగలేదు. 7 వేల మెగావాట్ల నుంచి 12 వేల మెగావాట్లకు పెంచామని చెప్పటం అబద్ధం.
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల తో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ పేర్కొనటంపై డిప్యూటీ సీఎం, విద్యుత్తుశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. కరెంటు పోయిందన్నది అవాస్తవమని ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రకటనపై స్పందించి స్థానిక ట్రాన్స్కో ఎస్సీని విచారణకు ఆదేశించామని, ఆయన ప్రకటనలో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ‘శనివారం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నిరంతర విద్యుత్తు సరఫరా జరిగింది. కరెంటు కోతలపై శ్రీనివాస్గౌడ్ ఇంటి పరిసరాల్లోని ఇంటి యజమానులను మా సిబ్బంది విచారించి ఎటువంటి కోతలు లేవని నిర్ధారించారు. శ్రీనివాస్గౌడ్ ఇంటి సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లో నమోదైన రీడింగ్లోనూ కరెంటు కోతలు జరగలేదని తేలింది’ అని వెల్లడించారు.