Mahendragiri Varahi | టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi). మీనాక్షి కథానాయికగా నటిస్తుంది. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి సమక్షంలో ఈ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ కామెడీ కింగ్ విలక్షణ నటుడు బ్రహ్మానందం ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా నచ్చి బ్రహ్మానందం ఈ సినిమా చేయబోతున్నారని, త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్ లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని చిత్ర దర్శకులు సంతోష్ జాగర్లపూడి తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.