అమరావతి : సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబు (Chandrababu ) ను ఈ ఎన్నికల్లో నమ్మి మరోసారి మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు గ్రామంలో నిర్వహించిన వైసీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014లో కూటమి తరుఫున చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో (Manifesto) లో ఓ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు.
రైతు రుణ మాఫీపై తొలి సంతకం, పొదుపు సంఘాల రుణాల వడ్డీ మాఫీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు, ఇంటికో ఉద్యోగం, ప్రతినెల నిరుద్యోగ భృతి అన్నారు. వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. అర్హులైన వారందరికీ మూడు సెంట్ల భూమి ఇవ్వలేదని ఆరోపించారు. 14 ఏండ్ల చంద్రబాబు పాలనలో ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసింది లేదని దుయ్యబట్టారు.
వైసీపీ 59 నెలల పాలనలో ఏనాడు లేనివిధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో 93 శాతం విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ను కడుతున్నామని, మేనిఫెస్టోను పవిత్రగ్రంథంగా భావించి 99శాతం హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇంటి వద్దకే రేషన్, పింఛన్ల పంపిణీ, పౌరసేవలు అందిస్తున్నామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తు చేశారు.