వాషింగ్టన్ : అగ్రరాజ్యంలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నియాపాలిస్ మంగళవారం తీర్పు వెలువరించింది. పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ను దోషిగా తేల్చిన కోర్టు.. త్వరలోనే నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. అలాగే డెరెక్ బెయిల్ను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు తీర్పుపై ఫ్లాయింట్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అనంతరం.. ఫ్లాయిడ్ మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. వీధుల్లో ఫ్లకార్డులు పట్టుకుని తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మేం మళ్లీ శ్వాస తీసుకోగలం’ అని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. ఇదిలా ఉండగా.. 40 ఏళ్ల పాటు డెరెక్కు జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపాలిస్ నగరంలో నకిలీ నోట్లు సరఫరా చేశారన్న ఆరోపణలతో 2020, మే 25న నిరసనలో పాల్గొన్న 46 జార్జి ఫ్లాయిడ్ను అరెస్టు చేసే నెపంతో ఫ్లాయిడ్ మెడమీద కాలుపెట్టి ఆయన మరణానికి పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ కారణమయ్యారు. ‘దయచేసి వదిలిపెట్టండి, నాకు ఊపి ఆడటంలేదు’ అంటూ జార్జ్ ఫ్లాయిడ్ ప్రాధేయపడినా కనికరించకుండా తొమ్మిది నిమిషాల పాటు గొంతును మోకాలితో అదిమిపట్టారు. ఈ కారణంగానే జార్జ్ ఫ్లాయిడ్ మరణించారని అభియోగాలు నమోదయ్యయి.
ఈ నేపథ్యంలో చౌవిన్.. సెకండ్ డిగ్రీ అన్ ఇంటెన్షనల్ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మ్యాన్స్లాటర్కు కారకుడని, అతనికి ఈ మూడు కేసులకు సంబంధించిన శిక్ష విధించనున్నట్లు కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా కోర్టు తీర్పుకు ముందు యూఎస్ అంతటా నేషనల్ గార్డ్స్ను మోహరించారు. కాగా, జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంలో ముగ్గురు పోలీసు అధికారులు నేరం చేసేందుకు డెరెక్ చౌవిన్ను ప్రేరేపించారంటూ కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది చివరలో కేసు విచారణకు రానుంది.
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శ్వేతసౌదం నుంచి మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధించి ఇది కీలక ముందడుగుగా అభివర్ణించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాకూడదని, నేటి తీర్పు ఆ సందేశాన్ని పంపుతుందన్నారు. ‘ఇది సరిపోదు.. ఇంతటితో ఆగదు’ అని పేర్కొన్నారు. నిజమైన మార్పును, సంస్కరణలు తెచ్చేందుకు, ఇలాంటి విషాదకరణ సంఘటను తగ్గించేందుకు మరింత కృషి చేయాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఫ్లాయిడ్ కుటుంబసభ్యులకు శ్వేతసౌధానికి పిలిచి మాట్లాడారు. అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా కమలా హారిస్ అభివర్ణించారు. తీర్పుపై మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హర్షం వ్యక్తం చేశారు. జ్యూరీ సరైన పని చేసిందని, కానీ.. నిజమైన న్యాయానికి ఇంకా చాలా చర్యలు అవసరమన్నారు. అలాగే ఫ్లాయిడ్ కుటుంబ తరఫున న్యాయవాది బెన్ క్రంప్ సైతం తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చరిత్రలో ఒక మలుపు అని, చట్ట అమలు.. జవాబుదారీతనంపై స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది’ అని క్రంప్ ట్వీట్ చేశారు.