New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు తాళలేకపోతున్నారు. మరోవైపు ఎండలో బయటకు వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నగరంలో సోలార్ హట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
స్థానిక షాలిమార్ బాగ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయబోతున్నారు. దీని గురించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లదనాన్ని అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అన్నివైపులా గడ్డిని ఏర్పాటు చేస్తారు. స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉండటం వల్ల లోపల అంతా చల్లదనాన్ని పరుచుకుంటుంది. ప్రజలకు దీనివల్ల నీడతోపాటు చల్లదనం లభిస్తుంది. ఇది సోలార్ శక్తి మీద నడుస్తుంది. ఈ హట్స్లో ప్రజలు ఎండ సమయంలో విశ్రాంతి తీసుకోవచ్చు. పౌరులు లోపల కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. అలాగే, చల్లటి మంచి నీరు అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తారు.
ఈ హట్స్ పైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం వల్ల దీన్నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఈ హట్ నిర్మాణ దశలో ఉంది. రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని సీఎం రేఖా గుప్తా ప్రారంభిస్తారు. ఢిల్లీ వ్యాప్తంగా మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూలింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కూలీలు, పాదచారులు, ప్రయాణికులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చి, మంచి ఫలితం ఉంటే నగరవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన.