అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు, అవినీతి, భూ మాఫియా లాంటి అంశాలపై అమిత్ షా మాట్లాడిన తీరును ఆయన వ్యతిరేకించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను కేంద్రమంతి చదివి వినిపించారని అందులో ఎలాంటి పస లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram) నిర్మాణంలో వైసీపీ జాప్యం చేస్తుందని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.
పోలవరంను చంద్రబాబు(Chandra Babu) ఏటీఎంలా వాడుకుంటున్నాడని విమర్శించిన బీజేపీ అగ్రనేతలు నేడు అదే చంద్రబాబుతో కలిసి పోటీ చేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబే అని దుయ్యబట్టారు. జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్స్ ద్వారా 850 కోట్లను సేవ్ చేశారని, స్పిల్వేను పూర్తి చేశారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని, రెండేళ్లలో కాదు అంతకుముందే ప్రాజెక్టును పూర్తి చేస్తారని ధీమాను వ్యక్తం చేశారు.
పోలవరాన్ని సిన్సియర్గా పూర్తి చేయాలని జగన్కు ఉందని అన్నారు. వాస్తవానికి కేంద్రమే పూర్తి చేయాల్సి ఉండగా చంద్రబాబు కో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అసత్య ప్రచారాలతో మోసం చేస్తుందని ఆరోపించారు. ఐదేండ్లలో 2.70 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా లబ్దిదారుల అకౌంట్లలో అవినీతికి ఆస్కారం లేకుండా జమ చేశామని అన్నారు. ప్రతి దానికి లెక్కలున్నాయని పేర్కొన్నారు.
జగన్రెడ్డి ప్రభుత్వంలో పారదర్శకంగా, దళారుల ప్రమేయం లేకుండా పథకాలు అందించామని తెలిపారు. 2014-19 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అవినీతి జరిగిందని, ఆనాడు బీజేపీ కూడా అవినీతిలో భాగస్వామ్యం పంచుకుందని ఆరోపించారు.