సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు విశ్వవిద్యాలయాలకు ఫీజులను తమ ద్వారా చెల్లిస్తే 10 శాతం రాయితీ ఇస్తానంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఏపీకి చెందిన యువకుడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కనోళ్ల అశోక్కుమార్, ఢిల్లీకి చెందిన తరుణ్, అమెరికాలో ఉంటున్న తరుణ్ స్నేహితులు. ఈ ముగ్గురు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో పనిచేశారు. ఆ సమయంలో ఎవరెవరు అమెరికాకు స్టూడెంట్ వీసాపై వెళ్లారనే సమాచారం సేకరించారు.
అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు ఫోన్ చేసి తమ ద్వారా యూనివర్సిటీకి సెమిస్టర్ ఫీజు చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ నమ్మించారు. కొందరు విద్యార్థులు వీళ్ల మాటలు నమ్మి బ్యాంకులలో డబ్బు డిపాజిట్ చేశారు. నిందితులు క్రెడిట్, డెబిట్ కార్డులతో యూనివర్సిటీకి మొత్తం ఫీజు చెల్లించేవారు. ఫీజు చెల్లించగానే విద్యార్థులు కూడా అక్కడ చెక్ చేస్తే ఫీజు పెయిడ్ అని రికార్డుల్లో ఉండేది.
విద్యార్థులు ఈ విషయాన్ని నిర్థారించుకోగానే, నిందితులు క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన బ్యాంకు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి, తమ కార్డుపై ట్రాన్సాక్షన్ మోసపూరితంగా జరిగిందంటూ ఫిర్యాదు చేసేవాళ్లు. అప్పటికే యూనివర్సిటీకి చెల్లించిన సొత్తును సదరు క్రెడిట్ కార్డు సంస్థ వెనక్కి తీసుకునేది. దీంతో యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు ఫీజు చెల్లించలేదనే నోటీసులు వచ్చేవి. విద్యార్థులు నిందితులకు ఫోన్ చేస్తే..మేం అప్పుడే చెల్లించామంటూ విషయాన్ని దాటవేసేవారు. ఈ విషయంపై సికింద్రాబాద్కు తిరుమలగిరికి చెందిన సుధాకర్ ఫిర్యాదు చేయడంతో నిందితుడు అశోక్కుమార్ను అరెస్ట్ చేసి, మిగతా వారికోసం గాలిస్తున్నారు.