అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని గుద్దింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మృతుల్లో పదేండ్ల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. బాధితులంతా అనంతపురంలోని సంగమేశ్వర్ నగర్కు చెందిన వారని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద ప్రమాదం జరిగిందని వెల్లడించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.