హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని నానుడి. ఇదే నిజమని నిరూపించింది విజయవాడలో జరిగిన సంఘటన. కరెంటు షాక్ తగలటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆరేండ్ల పిల్లాడికి ఓ మహిళా డాక్టర్ వెంటనే ఆయువు పోశారు. చలనం లేకుండా పడిపోయిన కుమారుడిని రక్షించుకోవాలనే తపనతో భుజాన వేసుకుని రోడ్డుపై పరుగులు పెడుతున్న తల్లిదండ్రులను గమనించి బాలుడికి రోడ్డుపైనే సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. ఆ మహిళా డాక్టర్ చేసిన పనికి ఇప్పుడు అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. విజయవాడలోని అయ్యప్పనగర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకెళితే.. విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన సాయి అనే ఆరేండ్ల బాలుడు మే 5న సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఒకసారిగా గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
చలనం లేకుండా పడిపోయిన బాలుడిని చూసి తల్లిదండ్రులు భుజాల మీదే మోసుకుంటూ దవాఖానకు పరుగులు పెట్టారు. అదే సమయంలో మెడ్సీ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నన్నపనేని రవళి అటుగా వెళ్తూ చూశారు. వెంటనే ఆరాతీసి, బాలుడిని పరీక్షించారు. అకడే రోడ్డుపై పడుకోబెట్టి సీపీఆర్ చేశారు. బాలుడి ఛాతిపై చేతితో ఒత్తుతూ, అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదుమని సూచించారు. దాదాపు ఏడు నిమిషాల పాటు సీపీఆర్ చేశాక బాలుడిలో చలనం వచ్చింది. ఆ వెంటనే బైక్పై బాలుడిని దవాఖానకు తీసుకెళ్లటంతో బాలుడి ప్రాణాలు దక్కాయి. డాక్టర్ రవళి సీపీఆర్ చేస్తుండగా కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేశారు. వీడియో వైరల్ కావటంతో అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు.