వాషింగ్టన్ : కరోనా సంక్షోభంతో సతమతమవుతోన్న భారత్కు పలు దేశాలు, సంస్థలు సాయాన్ని ప్రకటిస్తున్నాయి. తాజాగా మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. కేర్ సంస్థకు పది మిలియన్ డార్లు ఇవ్వగా.. ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలెటర్లు, బిపాప్, సీపీఏపీ యంత్రాలు సేకరించేందుకు గ్రాంట్ ఉపయోగపడుతుందని ట్విట్టర్ తెలిపింది. నిధులతో సేవా ఇంటర్నేషనల్ ఎన్జీఓ కరోనా బాధితుల ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు కొనుగోలు చేస్తుంది. వాటిని భారత్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాలకు పంపిణీ చేస్తారు’ ట్విటర్ తెలిపింది.
కేర్ ఎన్జీఓ తాత్కాలిక కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటులో ప్రభుత్వానికి సహకారం అందించడం, ఆక్సిజన్ అందించడం, ఫ్రంట్లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు సమకూర్చడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడడం చేస్తుందని పేర్కొంది. ఎయిడ్ ఇండియా సంస్థ సహాయంతో కొవిడ్ బాధితులను దవాఖానాల్లో చేర్చడం, వారి చికిత్సలకు అయ్యే ఖర్చులు భరించడం, లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులను బలోపేతం చేస్తాయని ట్విట్టర్ వివరించింది.