భారత్కు చేరుతున్న విదేశీ సాయం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఈ సాయాన్ని కువైట్, ఖతార్, సింగపూర్ దేశాలు పంపినట్టు భారత నావికాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధవల్ తెలిపారు. సింగపూర్ నుంచి విశాఖపట్నం ఓడరేవుకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్లో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకు (ఒక్కోటి 20 టన్నుల ఆక్సిజన్)లు, 3,898 ఆక్సిజన్ సిలిండర్లు, 10 వేల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు, 400 పీపీఈ కిట్లు వంటివి ఉన్నాయి. ఖతార్ నుంచి ముంబయికి చేరుకున్న ఐఎన్ఎస్ త్రిఖండ్లో 40 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, వైద్య పరికరాలు ఉన్నాయి. మంగళూరుకు చేరిన ఐఎన్ఎస్ కోల్కతా నౌకలో రెండు ఆక్సిజన్ కంటైనర్లు, 400 ఆక్సిజన్ సిలిండర్లతో పాటు 47 కాన్సన్ట్రేటర్లూ ఉన్నాయి. గతనెల 30న నౌకాదళం సముద్ర సేతు-2 మిషన్ ప్రారంభించింది.