తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శనివారం సమావేశం కానుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్లో జరుగనుంది. సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో నేరుగా హాజరుకాలేని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న వేళధర్మకర్తల మండలి సమావేశం జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
శ్రీవారి దర్శనం టికెట్ల కోటా పెంపు, ప్రస్తుతం తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధిని అలిపిరి వరకు పొడిగింపుపై విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయగా.. కొద్ది గంటల్లోనే భక్తులు కొనుగోలుచేశారు. ఈ క్రమంలో దర్శన టికెట్ల కోటా పెంపుపై ధర్మకర్తల మండలి చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి ప్రస్తుతం అలిపిరి పోలీస్స్టేషన్ వరకు పూర్తికావస్తోంది. ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్ సుబ్బారెడ్డి పరిశీలించారు. అలిపిరి వరకు పొడగించేలా చూడాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వారధి నిర్మాణం పొడగింపుపై చర్చించి, నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తిరుమలలో వివిధ ఇంజినీరింగ్ పనుల పురోగతి, భక్తుల సౌకర్యాలు, ఉద్యోగులకు కరోనా టీకా తదితర సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు.